హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12(నమస్తే తెలంగాణ) : గుండె సమస్యలకు చికిత్స చేయడంలో హైదరాబాద్లోని హోలిస్టిక్ హాస్పిటల్ రికార్ట్ సృష్టించింది. గుండె కొట్టుకోవడంలో తేడాలతో బాధపడేవారికి అందించే అధునాతన పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ టెక్నాలజీని మంగళవారం ఈ హాస్పిటల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ వీఎస్ రామచంద్రం, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోవింద్, నిపుణులు డాక్టర్ భరణివేలం, డాక్టర్ ప్రకాశ్ సంజయ్య మాట్లాడారు. గుండె విద్యుత్ ప్రవాహంలో లోపాలతో గుండె కొట్టుకోవడంలో వేగం పెరుగుదల, తగ్గుదల ఉంటుందని వెల్లడించారు.
చికిత్సలో భాగంగా గతంలో గుండెలోని కొన్ని భాగాలను వేడి చేయడం లేదా గడ్డ కట్టించడం ద్వారా సరిచేసేవారని, కానీ ఈ పీఎఫ్ఏ టెక్నాలజీ విద్యుత్ తరంగాల ద్వారా దెబ్బతిన్న కణాలను మాత్రమే సరిచేస్తున్నదని పేర్కొన్నారు. దీనివల్ల గుండె చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు, ఆహార వాహికకు ఎలాంటి హాని కలుగదని తెలిపారు. పాత పద్ధతులతో పోలిస్తే ఈ చికిత్స చాలా తక్కువ టైమ్లో పూర్తి అవుతుందని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ వీఎస్ రామచంద్ర పేర్కొన్నారు.