రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని, వైద్యరంగంలో తెలంగాణ సాధించిన సత్ఫలితాలను ఏ ప్రజారోగ్యసూచీలో అయినా స్పష్టంగా చూడొచ్చు. నీతి ఆయోగ్ ప్రకటించిన హెల్త్ ఇండెక్స్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ 16వ స్థానంలో, ఛత్తీస్గఢ్ 10వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ 7వ స్థానంలో నిలిచాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలైతే హెల్త్ ఇండెక్స్లో అట్టడుగున ఉన్నాయి.
– మంత్రి హరీశ్రావు
కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్యరంగం కొత్త చరిత్రను లిఖిస్తున్నది. మునుపెన్నడూ లేని విప్లవాత్మక కార్యక్రమాలు.. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య పథకాలకు బడ్జెట్ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా పెంచుతున్నది. జిల్లాకో వైద్య కళాశాల ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా జాతీయస్థాయి ఆరోగ్య సూచీల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తున్నది. 2022లో తెలంగాణ వైద్యారోగ్యరంగం కొత్త శిఖరాలను తాకింది. కేంద్రం నుంచి రాష్ట్రం అందుకున్న అవార్డులు ఎన్నో.. ప్రశంసలు మరెన్నో..
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఏటికేడు అభివృద్ధి చెందుతున్న వైద్యారోగ్య రంగం.. 2022లో కొత్త శిఖరాలను తాకింది. రాష్ట్ర చరిత్రలోనే అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు, పథకాలకు వేదికగా మారింది. అనేక రికార్డులు సొంతం చేసుకొన్నది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలువగా.. కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు అందించింది. ప్రశంసలు కురిపించింది. ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలను స్పష్టంగా వివరించింది. ప్రతి విభాగంలో ఏడాది కాలంలో సాధించిన వృద్ధిని వెల్లడించింది. ఇందులో ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే…
తలసరి కేటాయింపుల్లో మొదటిస్థానం
తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ ఈ ఏడాది దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సగటున ప్రభుత్వం రూ.3,092 బడ్జెట్ కేటాయించింది. గత ఏడాది రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి టాప్కు చేరుకొన్నది. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో అగ్రస్థానం
దేశవ్యాప్తంగా ఆరోగ్యరంగం స్థితిగతులను కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ అధ్యయనం చేసి ‘హెల్త్ ఇండెక్స్’ పేరుతో ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఏపీ తర్వాత నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ.. ఈసారి ఆ రాష్ర్టాన్ని అధిగమించింది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 9 జిల్లాల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో పంపిణీ చేసింది. బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చినట్టుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నది. మొత్తం 8 రకాల వస్తులు అందిస్తున్నది.
టిఫా స్కానింగ్ యంత్రాలు
గర్భిణుల్లో 10 శాతం మంది టిఫా స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ఈ యంత్రాలు విరివిగా అందుబాటులోకి లేకపోవడంతో ప్రైవేట్ను ఆశ్రయిస్తున్నారని సీఎం కేసీఆర్ గుర్తించారు. నాణ్యమైన వైద్యంతో పాటు, అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోనే అందించాలని నిర్ణయించి రెండు నెలల్లోనే 44 దవాఖానల్లో 56 యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో గర్భిణులకు ఒక్కో స్కానింగ్కు రూ.2,000 వరకు ఆదా అవుతున్నది.
డైట్, శానిటేషన్ చార్జీల పెంపు
రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను రెట్టింపు చేసింది. గతంలో రూ.40 ఉండగా రూ.80కి పెంచింది. శానిటేషన్ చార్జీలను రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచింది. ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల్లో ఎస్సీ, ఎస్టీలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించింది.
ఎన్సీడీ స్క్రీనింగ్
రోగాలను ముందుగా గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు రాష్ట్రంలో ఎన్సీడీ స్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత ఏడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్రీనింగ్ జరిగింది. ఇందులో 17.36 లక్షల మందికి బీపీ, 8.86 లక్షల మందికి మధుమేహం ఉన్నట్టు గుర్తించారు. వారందరికి ఉచితంగా ప్రభుత్వం మందుల కిట్లను (ఎన్సీడీ కిట్లు) ఆశ, ఏఎన్ఎంల ద్వారా ఇంటికే పంపిణీ చేస్తున్నది. జిల్లా, సీహెచ్సీల్లో ప్రత్యేకంగా ఎన్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. వీటిల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా పరికరాలను అందుబాటులో ఉంచింది.
గత ఏడాది కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు
రికార్డు స్థాయి బడ్జెట్
2022-23 రాష్ట్ర బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు రూ.11,440 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. 2021తో పోల్చితే ఏకంగా రూ.4,953 కోట్లు (76 శాతం) అధికం. ఇందులో ప్రాథమిక వైద్య సేవలకు (35 శాతం), టెర్షియరీ కేర్కు (46%) అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
మాతాశిశు సంరక్షణ
నార్మల్ డెలివరీలకు ప్రోత్సాహకం
అనవసర సిజేరియన్లను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ను ప్రారంభించింది. గతంలో సీ సెక్షన్లు చేస్తే ఇన్సెంటివ్ ఇచ్చే విధానం ఉండేది. దాన్ని రద్దు చేసి సాధారణ డెలివరీలు చేసిన వైద్య సిబ్బందికి రూ.3,000 ప్రోత్సాహకం అందిస్తున్నది. 2022 ఆగస్టు నుంచి ఇది అమలవుతున్నది.
ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం
ప్రభుత్వ దవాఖానల్లోని పరికరాలు నిరంతరాయంగా కండిషన్లో ఉంచేందుకు ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ప్రోగ్రాంను అమలు చేసింది. రూ.5 లక్షలకుపైగా విలువ ఉన్న పరికరాలను మూడు విభాగాలుగా విభజించింది. అనుక్షణం పర్యవేక్షిస్తున్నది.
బస్తీ దవాఖానలు
గత ఏడాది ప్రభుత్వం కొత్తగా 98 బస్తీ దవాఖానలు ప్రారంభించింది. దీంతో దవాఖానల సంఖ్య 334కు పెరిగింది. ఓపీ 2021లో 34 లక్షలు ఉండగా, 2022 నాటికి 47 లక్షలకు పెరిగింది. 38 శాతం పెరుగుదల నమోదైంది.
2022లో అవార్డులు, ప్రశంసలు
గత ఏడాది నవంబర్ 15వ తేదీన రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం మొదలైంది. ఏ రాష్ట్రంలోనూ ఒకే ఏడాది 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంతవరకు ప్రారంభం కాలేదు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి.
దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. 2,815 ఎంబీబీఎస్, 1,180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు జిల్లాకో మెడికల్ కాలేజీల లక్ష్యంలో భాగంగా 2023 విద్యా సంవత్సరానికి మరో 9 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు పనులు మొదలయ్యాయి.
సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన
హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. అల్వాల్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్లో వీటిని నిర్మిస్తున్నారు. వీటికితోడు వరంగల్ హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నారు. నిమ్స్లో అదనంగా 2,000 సూపర్ స్పెషాలిటీ పడకలను విస్తరిస్తున్నారు. వీటన్నింటికీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పూర్తయితే 8,200 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి.
దవాఖానల్లోని పడకల సంఖ్య
12,755 పోస్టుల భర్తీకి అనుమతి
గత ఏడాది వైద్యారోగ్య శాఖలో 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 969 సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రస్తుతం 1,147 అసిస్టెంట్ పోస్టులు, 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.