మాదాపూర్, జనవరి 29: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అత్యాధునిక సేవలతో రోగులు త్వరగా కోలుకొంటున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల విభాగం, వైద్య విజ్ఞాన శాస్త్రంలో చోటుచేసుకొంటున్న సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో రెండురోజులపాటు జరిగే అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సును మంత్రి హరీశ్రావు ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని, కరోనా సమయంలో లక్షలాదిమంది ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. కరోనాతో చాలామందికి ఊపిరితిత్తుల వ్యాధి పట్ల అవగాహన కలిగిందని చెప్పారు. ఒకప్పుడు గుండె, లివర్, కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకొనే వారని, కరోనా వల్ల పల్మనాలజీ గురించి చర్చించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో పల్మనాలజీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు అవగాహన కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా పుట్టకొస్తున్న వైరస్లు, ఊపిరితిత్తుల వ్యాధులు, దీర్ఘకాలంగా వేధించే ఉబ్బసం నుంచి ప్రస్తుత కరోనా వరకు ఉపశమనం కలిగించే బ్రాంకియల్ థర్మో ప్లాస్టీ, ఇంటర్వెన్షనల్ బ్రాంకోస్కోపిక్ థర్మల్ వేపర్ అబ్లెషన్ లాంటి అత్యాధునిక వైద్య విధానాలను దక్షిణాదిలో తొలిసారి ప్రవేశపెట్టిన ఘనత యశోద హాస్పిటల్స్ వైద్యులకు దక్కడం శుభపరిణామం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2 వేల మంది పల్మనాలజీ నిపుణులు ఈ సదస్సు ద్వారా కలుసుకొని ఆలోచనలు పంచుకోవడం గొప్ప విషయమని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు, డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, పల్మనాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ హరికిషన్, నిపుణులు పాల్గొన్నారు.