సూర్యాపేట : పంటల సాగు విధానంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారుల శిక్షణ సదస్సుకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఒకే పంట పండించకుండా ఇతర లాభదాయక పంటలు పండించేలా అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు.
రైతులు సస్యరక్షణ, సమీకృత వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చూడాలన్నారు. శాస్త్రవేత్తలు అందించిన సలహాలు, సూచనలను క్లస్టర్ల వారీగా రైతులకు వివరించి.. పంటమార్పిడి విధానాన్ని అనుసరించేలా చూడాలన్నారు. ఒక తెలంగాణలోనే క్లస్టర్స్ ఏర్పాటు చేసి రైతువేదికల ద్వారా పంటల సాగువిధానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే 2.80కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువలు ఉన్నాయని.. ఈ వానాకాలం పంట దాదాపు 3కోట్ల మెట్రిక్ టన్నులు దిగుమతి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా పండించే పంటలతో పాటు వరిని సాగు చేస్తున్నారన్నారు.
ముఖ్యంగా రైతులు పంటల మార్పిడి విధానాన్ని అలవర్చుకొని.. ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై దృష్టి పెట్టాలన్నారు. గతంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి ధాన్యం ఎగుమతి అయ్యేదని, ఇప్పుడు ఈ పరిస్థితులు లేవన్నారు. శిఓణ పొందిన వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, టెక్నికల్ సిబ్బంది ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై రైతు వేదికల్లో సదస్సుల ద్వారా పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఏఓ రామారావు నాయక్, ఉద్యాన అధికారి శ్రీధర్ గౌడ్, ఏడీఏలు సంధ్యారాణి, జగ్గు నాయక్, శాస్త్రవేత్తలు భారత్, నరేశ్, కిరణ్, ఏవోలు, ఏఈవో పాల్గొన్నారు.