కాచిగూడ, అక్టోబర్ 11: బీసీ కులగణన కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 24న బెంగళూర్లో జాతీయ సదస్సు, 31న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కులగణన పట్ల నిజాయితీని నిరూపించుకొన్నారని ప్రశంసించారు. బీసీ కుల గణన సాధ్యం కాదని అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం పిరికిపందలా వ్యవహరించిందని విమర్శించారు. బీజేపీ సీనియర్ నేతలంతా కలిసి ప్రధాని మోదీ మీద ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టకపోతే బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, లాల్కృష్ణ, భూపేశ్ సాగర్, రాజేందర్, ఉదయ్, సతీశ్, చంటి ముదిరాజ్, చరణ్యాదవ్ పాల్గొన్నారు.