కరీంనగర్ కలెక్టరేట్, జూలై 15 : ఉమ్మడి పాలనలో అంతరించిన కులవృత్తులు స్వరాష్ట్ర పాలనలో పునరుజ్జీవం పోసుకున్నాయని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కూలీలను ఆయావృత్తుల యజమానులుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కంకణం కట్టుకున్నారని తెలిపారు. అందులోభాగంగానే రూ.లక్ష సాయం పథకాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులవృత్తులకు రూ.లక్ష సాయం పంపిణీ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 30 మంది లబ్ధిదారులకు మంత్రి గంగుల చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు బీసీలను వెనక్కి నెట్టారని విమర్శించారు. ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాలు కులవృత్తులను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టాయని ఆరోపించారు. దీంతో ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నవారు ఆ సంస్థల్లో కూలీలుగా మారగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతరించిపోయిన వృత్తులను ఆదుకునేందుకు నాడు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కులవృత్తులకు పునర్వైభవం కల్పించారని వెల్లడించారు. కులవృత్తి చేసుకునే ప్రతి వెనుకబడిన తరగతుల కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం పథకం ప్రారంభించి, అమలు చేసేందుకు ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే రజకులు, నాయీబ్రాహ్మణులు ఏర్పాటు చేసుకున్న కులవృత్తుల దుకాణాలకు ఉచిత విద్యుత్తు పథకం అమలు చేస్తున్నట్టు వివరించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు రూ.2,500 వరకు ఖర్చు ఆదా అవుతున్నట్టు చెప్పారు. ఈ మొత్తం సదరు కుటుంబాల పోషణకు ఉపయోగపడుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.