ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసాధ్యం
హైకోర్టు పెద్దమనసు చేసుకోవాలి:మంత్రి తలసాని
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ సోమవారం రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం తగినంత సమయం లేనందున హైకోర్టు పెద్దమనసుతో స్పందించి ఈ ఏడాది యథావిధిగా నిమజ్జనం జరిగేలా అవకాశం కల్పించాలని కోరారు. నిమజ్జనాలపై హైకోర్టు వినాయకచవితి పండుగకు కేవలం ఒక రోజు ముందు తీర్పు ఇచ్చిందని, అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరిపోయాయని అన్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అసాధ్యమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని హైకోర్టు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకొంటున్నారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని, నిమజ్జనం పూర్తయ్యాక 48 గంటల్లోగా వ్యర్థాలను తీసేసి హుస్సేన్సాగర్ను శుభ్రం చేస్తామన్నారు. భవిష్యత్తులో నిమజ్జనాలపై హైకోర్టు ముందస్తుగా ఆదేశాలిస్తే తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, గణపతి శోభాయాత్రలో లక్షలమంది భక్తులు పాల్గొంటారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో భక్తులు, ఉత్సవాల నిర్వాహకుల మనోభావాలను గౌరవ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మంత్రి తలసాని వెంట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, చైర్మన్ సుదర్శన్ తదితరులు ఉన్నారు.