ఉండవెల్లి, జూలై 5: లంచం తీసుకొంటూ రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వెల్లడించిన వివరాల మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీరాములు, ఎల్లస్వామి.. జూలై 2020లో చిన్న ఆముదాలపాడు గ్రామ శివారులోని సర్వే నంబర్ 63/ఏ2లో కొంత భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకురావడంతో భూమి పట్టా మార్పిడి జరగలేదు.
కొంతకాలం నిరీక్షించిన అనంతరం పెండింగ్ మ్యుటేషన్లకు ధరణి సైట్లో ఆప్షన్ రావడంతో కలెక్టర్ లాగిన్కు 2021 అక్టోబర్ 14న సదరు అన్నదమ్ములు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా అన్న ఎల్లస్వామి కొనుగోలు చేసిన 2.22 ఎకరాల భూమికి సంబంధించి 2022 జూన్ 10న పాస్బుక్ వచ్చింది. శ్రీరాములు కొనుగోలు చేసిన 2.34 ఎకరాల భూమి భూదాన్లో ఉన్నట్టు ఆన్లైన్లో చూపించింది. ఈ సమస్యను పరిష్కరించాలని శ్రీరాములు గత నెల 19న తాసిల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను కలిశాడు. ఇందుకు ఆయన రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ.7,500కు ఒప్పందం కుదుర్చుకొన్నాడు. అనంతరం గతనెల 25న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు మంగళవారం ఉండవెల్లి తాసిల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాకు రూ.7,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. అయితే సాయిబాబా నివాసం ఉంటున్న కర్నూలు జిల్లాలోని సంతోష్ నగర్లోనూ హైదరాబాద్ ఏసీబీ ఇన్సెక్టర్ రమేశ్, మెదక్ ఇన్సెక్టర్ కే రమేశ్ సోదాలు నిర్వహించారు.