హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ధ్రువపత్రాల జారీలో ఆదాయాన్ని మాత్రమే ప్రతిపాదికగా తీసుకోవాలని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. స్థిరాస్తులతో సంబంధం లేదని చెప్పింది. ధ్రువపత్రాల జారీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాల మధ్య భూమి విస్తీర్ణం, ఇల్లు వంటి అంశాల్లో వ్యత్యాసం ఉండటంతో గందరగోళం తలెత్తింది. దీంతో పలువురు రెవెన్యూ శాఖను కోరగా, గురువారం స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం కేంద్రం నోటిఫికేషన్ ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆదాయాన్ని మాత్రమే ప్రతిపాదికగా తీసుకోవాలని చెప్పింది. ఈ మేరకు మీ సేవ పోర్టల్లో రెండు రకాల దరఖాస్తులను పొందుపరచాలని, వాటిల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేయాలని మీ సేవ ఎండీని కోరింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని రకాల ఆదాయ మార్గాలు కలిపి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉంటే చాలు. స్థిరాస్తులతో సంబంధం లేదు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు..
ఆదాయం: 8 లక్షలలోపు (అన్ని రకాల ఆదాయ మార్గాలు కలిపి)
స్థలం/ఇల్లు: మున్సిపాలిటీల్లో అయితే 100 గజాల్లోపు స్థలం, కార్పొరేషన్లలో అయితే వెయ్యి చదరపు అడుగుల్లోపు ఇల్లు, గ్రామాల్లో ఐదెకరాల్లోపు భూమి, మున్సిపాలిటీయేతర ప్రాంతాల్లో 200 చదరపు గజాల్లోపు ఇల్లు లేదా స్థలం.