CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని గుర్తించి బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టింది. సీఎం రేవంత్రెడ్డి బుధవారం రాత్రి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతోపాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి కూడా వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతో వారు భేటీ అయిన ట్టు తెలుస్తున్నది. ఈ సమావేశానికి బండ్ల కృష్ణమోహన్రెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలంతా హాజరైనట్టు తెలిసింది. కాంగ్రెస్లో చేరే వరకు తమతో సంప్రదింపులు జరిపి, ఆ తర్వాత త మను గాలికి వదిలేశారని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఓ సీనియర్ ఎమ్మెల్యే ఏకంగా మూడుసార్లు సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. చేరేముందు తనకు మంచి పదవి ఇస్తామని ఆశపెట్టి.. ఇప్పుడు కనీసం కలవకపోవం ఏమిటని ఆయన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు అని సీఎం స్పష్టంగా చెప్పడంతో మి గతా ఎమ్మెల్యేల ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు తమను రాష్ట్ర, స్థానిక కాంగ్రెస్ నేతలు, ఇతర ఎమ్మెల్యేలు కలుపుకోవడం లేదంటూ వారు అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తున్నది. అందుకే వారు అసెంబ్లీలో కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఒంటరిగా వచ్చిపోతున్నారని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘మాకు బీఆర్ఎస్లో ఉంటే అయినా గౌరవం ఉండేది’ అని సన్నిహితుల వద్ద వాపోతున్న ట్టు సమాచారం. వారి అసంతృప్తి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి రూపంలో బయటపడింది. రెండు రోజుల కిందట అసెంబ్లీలో కేటీఆర్ను కలిసి.. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని బండ్ల చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏం జరుగుతున్నదంటూ అధిష్ఠానం ఆరా తీయడంతో రేవంత్రెడ్డి అప్రమత్తమైనట్టు చెప్తున్నారు. దీపాదాస్ మున్షీ రం గంలోకి దిగి, సీఎంతో కలిసి పోచారం ఇంటికి వెళ్లి బుజ్జగింపులు జరిపినట్టు సమాచారం.