Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘ఆలులేదు.. చూలులేదు కొడుకుపేరు సోమలింగం’ అన్నట్టు తయారైంది కాంగ్రెస్లో సీఎం కుర్చీ పంచాయితీ. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్టుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఊహల్లో తేలిపోతున్నారు. ఆయన వ్యవహార శైలిపై పార్టీలోని ఇతర నేతలు సెటైర్లు వేస్తున్నారు. ‘మేం 30 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటున్నాం. వాళ్లల్లో 20 మందికి మేమే ఫండింగ్ చేసుకుంటున్నాం. ‘సీఎం..సీఎం’ అని నేనూ అనిపించుకోగలను. కానీ, అలాంటి చిల్లర పనులు చేయను’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరోక్షంగా రేవంత్రెడ్డికి చురకలు అంటించారు. ‘ప్రతి ఎమ్మెల్యే తాను సీఎం కావాలనుకుంటాడు. నువ్వు ఒంటరిగా వచ్చి నేనే బుడంకాయ్ అంటే ఎవడు పట్టించుకుంటాడు? ఎవడూ పట్టించుకోడు. తప్పనిసరిగా ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందే’ అని మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీలో మరింత కాక రేపుతున్నది.
ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడం కోసం తాపత్రయపడుతున్నారని ఆ పార్టీలోని సీనియర్ నేతలే కాకుండా అభ్యర్థులు కూడా ఆరోపిస్తున్నారు. తాను వేదిక మీదికి వస్తుండగానే ‘సీఎం సీఎం..’ అంటూ నినాదాలు చేసే బ్యాచ్ ఒకటి మస్ట్గా ఉండాలని రేవంత్రెడ్డి అభ్యర్థులకు హుకూం జారీ చేస్తున్నారనే ప్రచారం సాగుతున్నది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు తాము జమచేసిన వారితో ఆయన జై కొట్టించుకోవటం ఏమిటి? అని వాపోతున్నారట.
రేవంత్రెడ్డి ప్రచార ఆర్భాటం, ఇటీవల మీడియా వేదికల మీద తన హావభావ విన్యాసంపై పలువురు నేతలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం సాగుతున్నది. రేవంత్ను కట్టడి చేయకపోతే తమకు వచ్చే ఓట్లు కూడా రాకుండాపోతాయని పలువురు నేతలు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యంఠాకూర్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రేవంత్ ఎంత ఎగిరితే తమకు అంతమంచిదని మరో నేత తన సన్నిహితులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రజలను ఓట్లు అభ్యర్థించడానికి బదులుగా తనను సీఎం చేయాలని, తనకు మాత్రమే సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని చెప్పుకునే వేదికలుగా ఎన్నికల ప్రచారం మారిపోవడం తమ అధ్వాన్నస్థితికి దర్పణమని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు వ్యాఖ్యానించారు.