హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్రెడ్డి సరార్ వేసుకున్న అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులవుతున్నాయి. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలకు, వాస్తవ ఆదాయానికి పొంతన లేకుండాపోయింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలు నీరుగారుతుండగా, అప్పుల సేకరణ మాత్రం ఊహించని రీతిలో ఎగబాకుతున్నది.
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం (పన్నులు, గ్రాంట్లు) కేవలం 67 శాతానికే పరిమితమైంది. కానీ, అప్పులు మాత్రం లక్ష్యాన్ని దాటి 122 శాతానికి చేరుకున్నాయి. ఏడాది మొత్తానికి చేయాలనుకున్న అప్పును కేవలం తొమ్మిది నెలల్లోనే తెచ్చుకున్నారు. అదనంగా మరో రూ.11,000 కోట్లకు పైగా రుణాన్ని తెచ్చుకున్నారు. రాబడి పెంచడంలో విఫలమైన కాంగ్రెస్ సరార్.. అప్పులు చేయడంలో మాత్రం రికార్డులు సృష్టిస్తున్నది. ఇది రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉన్నట్టు ఆర్థిక నిఫుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత (2025-26) ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,84,837.30 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేసింది. కానీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు రాష్ట్ర ప్రభుత్వం పంపించే నెలవారీ ఆదాయ, వ్యయాల గణాంకాల ప్రకారం.. డిసెంబర్ నెలాఖరు నాటికి ఖజానాకు చేరింది కేవలం రూ.1,90,876.51 కోట్లు (67.01%) మాత్రమే. అంటే మరో మూడు నెలల్లో దాదాపు 33 శాతం ఆదాయాన్ని సాధించడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఖర్చు విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. బడ్జెట్లో రూ.2,63,486.73 కోట్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిసెంబర్ నాటికి రూ.1,77,204.16 కోట్లు (67.25%) మాత్రమే ఖర్చు చేశారు.
అంటే సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల విడుదల సక్రమంగా లేదని ప్రభుత్వ గణాంకాలను బట్టే స్పష్టమవుతున్నది. రేవంత్ సరార్ అనాలోచిత, తొందరపాటు నిర్ణయాల వల్లే రాష్ట్ర సొంత ఆదాయ వనరులైన జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ఆదాయాలు తగ్గుతున్నాయి. నాన్ట్యాక్స్ రెవెన్యూ 22.52 శాతం, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు 16.70 శాతమే వచ్చాయి. అభివృద్ధి పనులకు నిధుల విడుదల మందగించిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాబడి అంచనాలు తప్పినా.. అప్పుల విషయంలో మాత్రం రేవంత్రెడ్డి సరార్ లక్ష్యాన్ని మించి దూసుకెళ్తున్నది. బడ్జెట్లో ఏడాది మొత్తానికి రూ.54,009.74 కోట్ల మేర రుణాలు సేకరించాలని ప్రతిపాదించగా.. కేవలం తొమ్మిది నెలల్లోనే (డిసెంబర్నాటికి) ఒక ఆర్బీఐ నుంచే రూ.65,930.31 కోట్లు అప్పు తెచ్చింది. అంటే నిర్ణీత లక్ష్యం కంటే 122.07 శాతం అదనంగా అప్పులు చేసి రాష్ట్ర సంపదను హరించి వేస్తున్నదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోకుండా, కేవలం అప్పులపైనే ఆధారపడి బడ్జెట్ అంచనాలు వేయడం వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని, అప్పుల అంచనాలు దాటకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కోసం వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో పాత బడ్జెట్ వైఫల్యాలు చర్చనీయాంశంగా మారాయి. నీటి పారుదల, మున్సిపల్ శాఖలకు కేటాయింపులు ఉన్నా.. నిధుల విడుదల లేక పనులు ఎకడికకడ నిలిచిపోయాయి. ఆరు గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు అవసరమవ్వడంతో ఇతర అభివృద్ధి పనులకు బడ్జెట్లో కోత విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలాఉండగా, శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించాలని తేదీలు ప్రకటించారు. కానీ, మేడారం జాతర, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమీక్ష సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు, వాస్తవికతకు అస్సలు పొంతన ఉండటం లేదని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ముగిసే సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలు 80 శాతం కూడా చేరకపోవడం గమనార్హం. ప్రతి ఏటా భారీ అంకెలతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం తప్ప, ఆ మేరకు నిధులను సమీకరించడంలోనూ, వెచ్చించడంలోనూ రేవంత్రెడ్డి సరార్ విఫలమవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,74,057.64 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించింది. కానీ, మార్చి నెలాఖరు నాటికి వసూలైంది కేవలం రూ.2,17,651.41 కోట్లు మాత్రమే. అంటే 20 శాతం మేర ఆదాయం లోటు కనిపించింది. కేవలం 79.42 శాతం ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మొత్తం వ్యయం అంచనా రూ. 2,54,431.31 కోట్లు కాగా, ఖర్చు చేసింది రూ. 2,12,796.27 కోట్లు (83.64%). ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు నిధుల విడుదల ఆపేసిందని, అందుకే వ్యయం కూడా లక్ష్యాన్ని చేరలేదని కాగ్ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం పెంచుకోవడంలో చతికిలపడ్డ ప్రభుత్వం, అప్పులు చేయడంలో మాత్రం 100 శాతానికి చేరువైంది.
బడ్జెట్లో రూ.49,255.41 కోట్ల రుణ సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, మార్చి నాటికి రూ.48,322.20 కోట్లు (98.11%) అప్పులు తెచ్చేసింది. అంటే ఆదాయం రాకపోయినా, లక్ష్యం మేరకు అప్పులు తెచ్చి మరీ నెట్టుకొచ్చినట్లు స్పష్టమవుతున్నది. రాబోయే బడ్జెట్ అంచనాలనైనా వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో మేడలు కట్టినట్టు అంకెలు చూపడం కంటే, వచ్చే రాబడిని బట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనాలు vs వాస్తవాలు (మార్చి వరకు, కాగ్ లెక్కల ప్రకారం)
