హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హుజూర్నగర్ ఉపఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హైకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఐదు క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పద్మావతిరెడ్డి తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనుమతి లేకుండా రేవంత్రెడ్డి రోడ్షో నిర్వహించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని, సమావేశాల్లో లౌడ్స్పీకర్లు, మ్యూజిక్లతో ప్రజలకు అసౌకర్యం కలిగిందని అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తనపై వేర్వేరుగా నమోదైన ఐదు క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ రేవంత్రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై విచారించిన జస్టిస్ కే సుజన కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల కేసులను నిబంధనలకు అనుగుణంగా నమోదు చేయలేదని, వీటిపై తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసులు కొట్టివేశారు.