హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఒక్కొక్కరుగా కీలక నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. ఏండ్ల నుంచి పార్టీలో కొనసాగిన వీరు.. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, నిందలతో దూరం అవుతున్నారు. డీకే అరుణ నుంచి మొదలైన ఈ వలసల పర్వం తాజాగా ఏలేటి మహేశ్వర్రెడ్డి వరకు చేరింది. మూడేండ్లలో డజనుకు పైగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు.
రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావడానికి ముందు సీనియర్ నేతలు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్రెడ్డి, గూడూ రు నారాయణరెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, విక్రమ్గౌడ్, భిక్షపతి యాదవ్ వంటి కీలక నేతలు పార్టీని వీడారు. ఇక రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైన తర్వాత దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, తాజాగా ఏలేటి పార్టీని వీడారు. దీంతో ఈ వలసల పరంపర ఇప్పట్లో ఆగేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి దారిలోనే మరికొంత మంది నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పుడు పార్టీని వీడినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
అన్ని వేళ్లు రేవంత్ వైపే..
కీలక నేతలు పార్టీ వీడడంపై అన్ని వేళ్లు కూడా రేవంత్రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పార్టీని వీడుతున్న నేతలంతా రేవంత్ కారణంగానే వెళ్లిపోతున్న ట్టు కొందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి సీనియర్లను గెంటేసే పని పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే పార్టీకి చెందిన సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అవమానాలకు గురి చేయడం, నిందలు వేయడం వంటి కుట్రలు చేశారనే విమర్శలు ఉన్నాయి.