Revanth Reddy | అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని తెలిపారు. అనుమతి నిరాకరించడంతో బోస్టన్కు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఈ అంశంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.
లండన్ పర్యటనలో అన్ని సమావేశాలు, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని రేవంత్ రెడ్డి తెలిపారు. మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్కు తిరిగి వస్తున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ అంశానికి సంబంధించిన అన్ని విషయాలపై మాట్లాడతానని స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా పార్టీ నాయకులు, ప్రజల నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటననకు కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అనుచిత సమావేశాల వల్లే అనుమతిని నిరాకరించామని, ముఖ్యమంత్రి హోదాకు, ఉద్దేశానికి అనుగుణంగా ఈ పర్యటన లేదని తెలిపారు.
సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఎవరైనా విదేశాలకు అధికారిక హోదాలో వెళ్తే వారి పర్యటనను విదేశాంగ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి పర్యటనకు వెళ్లేవారు విదేశాంగ శాఖకు తొలుత అనుమతుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారి అనుమతి ఉంటేనే వెళ్లాలి. విదేశాంగ శాఖ అధికారులు అమెరికా లేదా మరే దేశానికైనా వెళ్లే ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రుల పర్యటనల వివరాలను పరిశీలించడంతోపాటు మన దేశానికి సంబంధించిన విధానపరమైన అంశాలపై చర్చలు, ప్రసంగాల అంశంపై కూడా సూచనలిస్తారు.
ఆ పరిధి దాటవద్దని చెప్తారు. అలాగే, మన దేశ విదేశాంగ విధానానికి విరుద్ధంగా ఉండేవారిని అధికారికంగా కలువవద్దని చెప్తారు. వీటన్నింటికి సంబంధించిన అడ్వైజరీ నోట్ను భారత విదేశాంగ శాఖ అందజేస్తుంది. రేవంత్ విషయంలో కూడా ఇదే విధమైన అడ్వైజరీని కేంద్రం ఇచ్చింది. అయితే, ఇక్కడ గమనించాల్సిందేందంటే.. రేవంత్రెడ్డి తన పర్యటన వివరాలను పూర్తిస్థాయిలో కేంద్ర విదేశాంగ శాఖకు అందించలేదు. పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పలేదు. అందుకే హోదాకు తగ్గట్టు పర్యటన లేదని విదేశాంగ శాఖ అధికారులు స్పష్టంచేశారు.
మన దేశ విదేశాంగ శాఖ అధికారులు స్పందిస్తూ సీఎం పర్యటన ఉద్దేశాలపై స్పష్టతలేదని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సీఎం హోదాలో అమెరికా పర్యటన కు వెళ్లాలనుకున్న రేవంత్ తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకున్నాడన్నదీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందరికీ బయట సోషల్ మీడియాలో, ప్రకటనల్లో చెప్తున్నట్టు అమెరికాలోని విశ్వవిద్యాలయాల ను చూసేందుకు, అక్కడి చదువులపై స్టడీ చే సేందుకు మాత్రం కాదని కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తేటతెల్లమైంది. పెట్టుబడుల కోసం కూడా కాదని తేలిపోయింది. ఇక్కడ బయటపెట్టని ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నట్టు తెలుస్తున్నది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రేవంత్రెడ్డి భేటీ అయ్యేందుకు ప్రయత్నించినట్టు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్రెడ్డి తమ్ముడు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏదో ఒక మీటింగ్లో కలిపించాలని, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. మొదట వీటి గురించి చెప్పవద్దని, చెప్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సీఎం సన్నిహిత వర్గాలు భావించినట్టు తెలిసింది.