బేగంపేట్ డిసెంబర్ 23: భారతదేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్థంతి సందర్భంగా శనివారం నెక్లెస్రోడ్లోని జ్ఞానభూమిలోని ఆయన సమాధి వద్ద సీఎం పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు దయాకర్గుప్తా, సురభి వాణీదేవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు తదితరులు పీవీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకువచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో భవిష్యత్తు తరాలకు చాటి చెప్పిన గొప్ప మహానీయుడని కొనియాడారు. ఈ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ ఆర్థిక సంస్కరణలు చేపట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. బంగారం కుదువ పెట్టి అప్పులు తేవడంపై పీవీ ఒక మాట చెప్పారని.. తెలివైన వాడు సగం ఆస్తిని కుదువ పెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని చెప్పారని గుర్తుచేశారు. పీవీ ఘాట్, జైపాల్రెడ్డి ఘా ట్లను అభివృద్ధి చేయాల్నిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వీరిద్దరు తెలంగాణకు లంకెబిందెల్లాంటి వారని, వారి కీర్తిని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్ అధికారులు దానకిశోర్, అమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పీవీ ఘాట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు, భజనలు జరిగాయి.
ప్రపంచంలో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావే పునాది వేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. న్యూఢిల్లీలోని తెలంగాణభవన్లో శనివారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడు పీవీ అని కొనియాడారు. విద్యావ్యవస్థతోపాటు అనేక సామాజిక సంసరణలు తెచ్చిన మహానుభావుడని, పీవీ తెలంగాణలో పుట్టడం ఈ ప్రాంత బిడ్డగా తానెంతో గర్విస్తున్నానని తెలిపారు. అనేక భాషలపై పట్టు సాధించడంతోపాటు పాలనలో తనదైన శైలి, ప్రత్యేక ముద్రను చాటుకున్న పరిపాలన దక్షుడని కొనియాడారు. దేశ రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులుగా పనిచేసిన ఆయన ఎవరి ప్రభుత్వంలో ఉన్నా ఆ ప్రభుత్వానికి కావాల్సిన మార్గదర్శకాలు తయారు చేయడంలో దిట్టని చెప్పారు.