హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాయాలని సూచించారు. ఆ లేఖ రాసే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి అప్పగించారు. వానకాలంలోగా బరాజ్లకు సాంకేతిక పరీక్షలను పూర్తిచేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖపై మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎంవో కార్యదర్శి మాణిక్రాజ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తదితర అధికారులతో సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లకు సంబంధించిన సాంకేతిక పరీక్షలు, తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంతోపాటు, తుమ్మిడిహట్టి-సుందిళ్ల అలైన్మెంట్, రాష్ట్రంలోని ప్రాజెక్ట్ల భూసేకరణ తదితర అంశాలపై సీఎం ఈ భేటీలో చర్చించి ఆయా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ను నిర్మిస్తేనే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, తద్వారా తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. గతంలో 148 మీటర్ల ఎత్తుతో బరాజ్ను నిర్మించేందుకే మహారాష్ట్ర అంగీకరించిందని, ఇప్పుడు 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ను నిర్మించాలంటే మహారాష్ట్రతో మళ్లీ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
దీంతో తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించేందుకు కార్యాచరణ వేగవంతం చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. బరాజ్ ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్రలో ఎకడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి సూచించారు.
కేంద్ర మంత్రిని నేరుగా కలిసి చర్చించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి అప్పగించారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకు అవసరమైన సాంకేతిక పరీక్షలను వానకాలంలోగా పూర్తిచేసేలా టైమ్లైన్ను ఫిక్స్ చేసుకోవాలని, ఆయా పనుల వివరాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా ఎన్డీఎస్ఏకి అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్బాబు, జయశంకర్ భూ పాలపల్లి కలెక్టర్ రోహిత్ శర్మ, ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులు, నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇటీవల గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన దోర్జీ గ్యాంబా బుధవారం ప్రత్యేకంగా సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జీఆర్ఎంబీకి సంబింధించిన విషయాలపై చర్చించారు.