హైదరాబాద్ ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం గా ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఆర్భాటంగా శ్రీకారంచుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో అమలుచేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. తీరా ఏడాదిన్నర తర్వాత జూన్, 2025లో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ తర్వాత ఆరు నెలలకు జనవరి 2026లో షురూ చేసింది. మొదటి విడత మూడు నెలల(జనవరి, ఫిబ్రవరి, మార్చి)కు సంబంధించి 40వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.12 కోట్లు జమచేసి మురిపించింది. ఆ తర్వాత మూడు నెలలకు సంబంధించి నగదు జమచేయడం మరచింది. సర్కార్ వైఖరి చూస్తుంటే మూడో విడత నిధుల విడుదలపై సందిగ్ధం నెలకొన్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జనవరి 2025లో చేనేత అభయహస్తం పథకానికి ఆమోదం తెలిపారు. ఇందులో నేతన్న పొదుపు నిధి, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలను చేర్చారు. అమలుకోసం మొత్తంగా బడ్జెట్లో రూ.168 కోట్లు కేటాయించారు. ఇందులో నేతన్న భరోసాకు రూ.48 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆరు నెలలకు అంటే, జూన్ 2025లో మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆరు నెలలు అర్హుల గుర్తింపు పేరిట జాప్యం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది లబ్ధిదారులున్నట్టు గుర్తించారు. జియోట్యాగింగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున డీబీటీ పద్ధతిలో ఖాతాల్లో జమచేయాలని, మొదట రెండు విడతల్లో అంటే, ఏడాదిలో ఆరు నెలలకోసారి అందించాలని నిర్ణయించారు.
అనేక ఒడిదుడుకుల మధ్య సంక్రాంతి కానుకగా నేతన్నకు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు 2026 జనవరి 10న మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయించామని చెప్పారు. అయితే మార్గదర్శకాల్లో ఏడాదికి రెండు విడతల్లో 40వేల మందికి అందజేస్తామని చెప్పిన సర్కార్, ఆ తర్వాత మాటమార్చింది. నాలుగు విడతల్లో అంటే మూడు నెలలకోసారి కార్మికులకు రూ. 4,500, అనుబంధ కార్మికులకు రూ.1,500 చొప్పున అందజేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది మొదటి మూడు నెలలకు సంబంధించి నగదు కార్మికుల ఖాతాల్లో జమచేశారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన నగదు ఇప్పటికీ అందజేయలేదు. ఈ విషయమై మంత్రి తుమ్మలకు విన్నవించినా ఫలితంలేకుండా పోయిందని నేతన్నలు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ హామీ మేరకు ‘నేతన్న భరోసా’ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాప్యం చేస్తే తగిన కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.
పథకం: నేతన్నకు భరోసా
లబ్ధిదారులు : 40 వేలమంది చేనేత కార్మికులు
బడ్జెట్లో కేటాయించిన నిధులు: రూ.48కోట్లు
మార్గదర్శకాల విడుదల: జూన్ 2025లో
అమలు ప్రారంభం : జనవరి 2026లో
ఇప్పటివరకు అందించిన నగదు : రూ. 12 కోట్లు