హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్లో ముసలం పుట్టించిన ‘నైని’ బొగ్గు గని అవినీతి పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి హోదాలో 62వసారి బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైని బొగ్గు బ్లాక్ వివాదం, మీడియాలో మంత్రులపై కథనాలతోపాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా నైని బొగ్గు గని వివాదం మొత్తానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కే మూల కారణమని అధిష్ఠానానికి ఆయన ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇందుకు సంబంధించిన ఆధారాలను, భట్టిపై ఇతర ఫిర్యాదుల చిట్టాను ఖర్గే ముందు పెట్టినట్టు సమాచారం. దీంతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఓ ఐఏఎస్ అధికారితో అనైతిక బంధం అంటగడుతూ ఓ మీడియాలో కథనం ప్రసారం కావడం, ఆ తర్వాత నైని బొగ్గు గని టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, ఇం దులో డిప్యూటీ సీఎం భట్టి పాత్ర ఉన్నదం టూ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు రాయడం, తదనంతర పరిణామాలను ఖర్గేకు రేవంత్ వివరించినట్టు అధిష్ఠానంతో సన్నిహితంగా మెలిగే పార్టీ వర్గాలు తెలిపాయి.
భట్టిపై అధిష్ఠానానికి ఫిర్యాదుల చిట్టా
ఖర్గేతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సంబంధిం చి ఫిర్యాదుల చిట్టాను అందించినట్టు కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నది. అనవసరంగా నైనీ బొగ్గు గని వ్యవహారంలో దూరి ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని సీఎం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. భట్టి విక్రమార్కపై మీడియాలో వచ్చిన కథనాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి తాను రాయించలేదని రేవంత్రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఓ మీడియా అధినేతకు మధ్య బంధాన్ని నిరూపించే ఆధారాలను ఖర్గే ముందు పెట్టినట్లుగా తెలిసింది. గతంలో భట్టిపై కమీషన్ల ఆరోపణలు వస్తే తానే కాపాడానని, అప్పటి నుంచి తప్పని పరిస్థితుల్లో బిల్లుల విడుదల అజమాయిషీని సీఎంవో ఆధీనంలోకి తీసుకున్నట్టు రేవంత్రెడ్డి చెప్పారట. ఇప్పుడు నైనీ వివాదం పార్టీకి, ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారిందని, గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయనను తాను కాపాడలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఏం చేయమంటారో చెప్పండి!!
సీఎం రేవంత్రెడ్డి పనిలో పనిగా మం త్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖపై కూడా ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరి శాఖల్లోని అవినీతికి సంబంధించి ఆధారాలను సైతం అందజేసినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇలా అయితే తాను పని చేయలేనని, ‘ఏం చేయమంటారో మీరే చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తా’ అని చెప్పినట్టు చర్చ నడుస్తున్నది.