హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో అధికారులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 ఏండ్లకు పెంచారు. సోమవారం జరిగిన బోర్డు 557వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సింగరేణిలో కూడా అమలుచేయనున్నట్టు సీఎండీ తెలిపారు. గత మార్చి 31 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నామని ఫలితంగా 43,899 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. మార్చి 31 నుంచి జూన్ 30 మధ్య రిటైర్ అయిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. సింగరేణి ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకుకూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
కారుణ్య నియామకాల్లో…
కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు.. పెండ్లి అయిన, విడాకులు తీసుకొని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడిన కుమార్తెలకు, ఒంటరి మహిళలకు కూడా కారుణ్య నియామకాల్లో వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఎగ్జిక్యూటివ్, ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగ నియామకాలలో.. గతంలో కొన్ని లింగపరమైన ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అన్ని పోస్టులకు లింగ భేదాన్ని తొలగిస్తూ.. ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి బోర్డు అంగీకరించింది.
సామాజిక బాధ్యత కింద రూ.60 కోట్లు కేటాయింపు
సింగరేణి కార్పొరేట్ బాధ్యత (సీఎస్ఆర్) కింద 2021-22 సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఫస్ట్క్లాస్ మైన్ మేనేజర్ సర్టిఫికెట్ ఉన్న మైనింగ్ అధికారుల హోదా మార్పుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కాలనీ వద్ద జాతీయ రహదారి విస్తరణలో నిర్వాసితులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చ.గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్లను కేటాయించడానికి బోర్డు అంగీకరించింది. దీనితోపాటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సింగరేణి ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
పదవీ విరమణ పెంపుపై హర్షం..
సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచడం, మైనింగ్ అధికారుల (ఫస్ట్ క్లాస్) డిజిగ్నేషన్ మార్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలపడంపై బొగ్గు గని అధికారుల సంఘం (సీఎంవోఏఐ) హర్షం వ్యక్తంచేసింది. అధికారుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకున్న సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్కు సోమవారం సీఎంవోఏఐ అధ్యక్ష, కార్యదర్శులు జక్కం రమేశ్, ఎన్వీ రాజశేఖర్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.