హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు (Forest Affairs)గా రిటైర్డ్ పీసీసీఎఫ్ శోభ సోమవారం నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF)గా శోభ సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు.
ఆమె స్థానంలో కొత్త పీసీసీఎఫ్గా రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1988లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా శోభ విధుల్లో చేరారు. 2019 జూలై 31న పీసీసీఎఫ్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఫారెస్ట్ ఫోర్స్కు నాయకత్వం వహించిన మొదటి ఐఎఫ్ఎస్ అధికారిగా శోభ గుర్తింపు పొందారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో అడవుల రక్షణ, అటవీ పునరుజ్జీవం, హరితహారం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు.