ఆర్మూర్, మే 28: ధరల నిర్ణాయక కమిషన్ (సీఏసీపీ)ను రద్దు చేసి దాని స్థానంలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తమిళనాడులోని దిండిగల్లో నిర్వహించిన భారత రైతు సంఘాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఎగుమతులను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య తీర్మానం చేసిందని చెప్పారు. రైతుల జీవితంలో గుణాత్మక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.
తెలంగాణలోని రైతు పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఆకాంక్ష సమావేశంలో వ్యక్తమైందని తెలిపారు. మహారాష్ట్ర షేత్కారి సంఘటన నాయకుడు, సీఐఎఫ్ఏ అధ్యక్షుడు వసంత్ బాబా పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వివిధ రాష్ర్టాల రైతు నాయకులు ధర్మేంద్రమాలిక్, అశోక్ బాలియా, సేనసింగ్, దైవ శివమణి, గోపాల్రెడ్డి, వెంకటస్వామినాయుడు, అయ్యాకణ్ణన్, తెలంగాణ సీఐఎఫ్ఏ అధ్యక్షుడు సోమశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.