రెంజల్ : నిజామాబాద్ జిల్లా రెంజల్లో బీజేపీ ఎంపీపీ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతులు సాగు చేసిన ధాన్యం కొనాలని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ లోలపు రజనీ (బీజేపీ) అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మేరకు తీర్మానాన్ని సభ ఆమోదించగా.. కాపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్ ద్వారా పంపనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లు తీర్మానం చేసి, ప్రధాని కాపీలను పంపాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెంజల్ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ లోలపు రజిని (బీజేపీ) అధ్యక్షతన.. ఎంపీడీవో గోపాల కృష్ణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులు యసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలుకు ఎంపీపీ రజిని ఏకగ్రీవ తీర్మానానికి ప్రవేశ పెట్టగా సభ్యులు ఆమోదించారు. అనంతరం కాపీని ఎంపీపీ, సభ్యులు ఎంపీడీవోకు అందజేశారు.