హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని జీఐ ప్రతినిధి, రిసొల్యూట్ గ్రూప్ లీగల్ హెడ్ సుభజిత్ సాహా పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు పర్యాటకం (జియోగ్రఫికల్ ఇండికేషన్ టూరిజం)పై దృష్టి సారించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
రాష్ట్రంలోని పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలను కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ పర్యాటక గ్రామాలుగా గుర్తించడం తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పర్యాటకం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక కళాకరులకు మేలు చేకూరడంతోపాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుందని తెలిపారు.