మల్హర్, ఫిబ్రవరి 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్కాస్టు బొగ్గు గనిని శనివారం భూనిర్వాసితులు చుట్టుముట్టారు. ఇచ్చిన మాట ప్రకారం డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిచెర్ల, కాపురం నిర్వాసితులు బొగ్గు ఉత్పత్తి పనులను అడ్డుకున్నారు. ఓపెన్కాస్టు గనిలో బ్లాస్టింగ్ మూలంగా ఇండ్లు దెబ్బతిని, వాయు కాలుష్యంతో జీవచ్ఛవంలా జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
వారం రోజుల క్రితం బొగ్గు ఉత్పత్తి పనులను అడ్డుకోగా ఈ నెల 20లోగా న్యాయం చేస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించామని గుర్తుచేశారు. ప్రతిసారి మాటలతో పంపించడం కాదని, డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను తీసుకునే ఉద్దేశం ఉందా లేదా తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడు గంటల పాటు ఎండలో నిల్చొని నిరసన తెలుపడంతో తాడిచెర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి, రవాణా స్తంభించిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వినలేదు. స్థానిక సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ రాజు ఓపెన్కాస్టు గని వద్దకు చేరుకొని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. సోమవారం వరకు మంత్రి సమయం ఇచ్చారని వారు తెలుపడంతో ఆందోళన విరమించారు.