సర్పంచ్ సహా 1,500 మంది వలస
ఐదు నెలలుగా అలంపూర్లోనే నివాసం
పత్తి, మిరప పనులతో బతుకుదెరువు
ఉండవెల్లి, డిసెంబర్ 14: సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జిల్లా అది.. తలాపునే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా తాగు, సాగునీరు దొరక్క ప్రజలు తల్లడిల్లిన స్థితి.. బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని వలస వెళ్లిన దుస్థితి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో పాలమూరు పచ్చబడింది. స్వరాష్ట్రంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల లింక్ కెనాల్ పనులు పూర్తవ్వడంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు సాగునీరు పరుగులు పెడుతున్నది. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలో 5.34 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. 2021 వాన కాలంలో 3.96 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు. 35 వేల ఎకరాల్లో మిర్చి, లక్షా 96 వేల ఎకరాల్లో పత్తి, 96 వేల ఎకరాల్లో వరి పండించారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి లాభసాటి పంటలను సాగు చేస్తూ నడిగడ్డ రైతులు ఆంధ్రప్రదేశ్ వలస కూలీలకు ఉపాధిమార్గంగా నిలిచారు. అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల మండలాలకు ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి వివిధ గ్రామాల వారు 1,500 మంది బతుకుదెరువుకు వచ్చారు. కుటుంబాలతో కలిసి ఐదు నెలలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నారు.
ఆ ఊరి అబ్బాయికి పిల్లనివ్వాలంటే.. అమ్మో ఆ ఊరికా అంటూ వెనుకడుగు వేసిన సందర్భాలు.. ఊరిలో ఉన్న ఒకే ఒక్క ఉప్పు నీటి బావి నీళ్లనే తాగి బతుకాల్సిన పరిస్థితులు.. ఉపాధి లేక గ్రామాన్ని వదిలిపెట్టిన జనం.. అలాంటి స్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని నిలబడ్డది జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు. నాడు వలస వెళ్లిన గ్రామానికే నేడు వందల మంది బతుకుదెరువు కోసం వచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో సాగునీటి వనరులు వృద్ధి చెంది.. సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో కూలీల కొరత ఏర్పడ్డది.. దీంతో ఏపీ నుంచి కూలీలు వలస వచ్చి 5 నెలలుగా గ్రామంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండటం విశేషం.
నాడు తాగునీరు లేని ఊరే..
ఉమ్మడి రాష్ట్రంలో ఉండవెల్లి మండలంలోని ఇటిక్యాలపాడు గ్రామంలో తాగేందుకు మంచినీరు కూడా దొరికేది కాదు. ఎక్కడ బోరు వేసినా ఉప్పు నీరు మాత్రమే వచ్చేది. దీంతో గ్రామస్థులు చుట్టుపక్కల ఊర్లకు ఎడ్లబండ్లపై వెళ్లి తాగునీటిని తెచ్చుకొనేవారు. తాగు, సాగునీరు లేని ఈ ఊరికి పిల్లను ఇవ్వాలన్నా ఆడబిడ్డల తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. సీఎం కేసీఆర్ హయాంలో పుష్కలంగా సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన విత్తనాల విక్రయంతో రైతులు ధీమాగా పంట సాగు చేపట్టారు. వరికి స్వస్తి పలికి లాభసాటి పంటలైన పత్తి, మిరప, ఉల్లి, పప్పుదినుసులు సాగు చేసి అధిక దిగుబడిని సాధిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలోని కర్నూల్ జిల్లా ప్రజలు ఇక్కడికి వలస వస్తున్నారు.
ఐదు నెలల్లో రూ.1.50 లక్షల సంపాదన
మూడు నెలల కిందట ఇటిక్యాలపాడుకు భార్యా, ఇద్దరు పిల్లలతో వచ్చాను. రోజూ ఉదయం 6 నుంచి సాయత్రం 6 వరకు పత్తి తీసే పనులు చేస్తున్నాం. భార్యాభర్తలం కలిసి రోజుకు 120 కేజీల పత్తి తీస్తాం. కిలోకు రూ.12 నుంచి రూ.15 వరకు చెల్లిస్తారు. దీంతో నెలకు ఖర్చులన్నీ పోనూ రూ.25 వేల నుంచి రూ.30 వేలు మిగులుతున్నాయి. ఐదు నెలల్లో రూ.1.50 లక్షలు సంపాదించుకొని వెళ్తాం.- ఆంజనేయులు, తిమ్మాన్దొడ్డి, సీ బెళగల్ మండలం, కర్నూలు, ఏపీ
సర్పంచ్తో కలిసి పనికి వచ్చినం
మా ఊరి సర్పంచ్ నాగలక్ష్మి సహా 50 కుటుంబాల వాళ్లం మూడు నెలల కిందట ఇటిక్యాలపాడుకు వలస వచ్చాం. కూలీ గిట్టుబాటు అవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తతో సర్పంచ్ నాగలక్ష్మి, భర్త రామాంజి, కూతురు, కొడుకును మా మండల అధికారులు వచ్చి తీసుకెళ్లారు. దీంతో సర్పంచ్ కుటుంబానికి ఉపాధి లేకుండా పోయింది. – దుర్గమ్మ, తిమ్మాన్దొడ్డి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్
కేసీఆర్ సార్ పాలన బాగుంది
సీఎం కేసీఆర్ సార్ పాలన ఎంతోబాగున్నది. ఇక్కడి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు కూడా మమ్మ ల్ని బంధువుల్లా చూసుకొంటున్నా రు. మా గ్రామంలో దసరా వరకే కూలీ దొరుకుతుంది. ఈ ప్రాంతం లో జనవరి, ఫిబ్రవరి వరకూ పంటలు సాగు చేస్తున్నారు. ఐదు నెలల వరకు కూలీలకు ఉపాధి దొరుకుతుంది.
-గోకారి, తిమ్మాన్దొడ్డి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్