బంజారాహిల్స్, మార్చి 9: పేద మైనార్టీ మహిళలకు పంపిణీ చేసిన కుట్టుమిషన్లను వెనక్కి ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడం హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుడు అక్టోబర్లో పేద మైనార్టీ మహిళలకు తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. తొలివిడతగా 100 కుట్టుమిషన్లను అందించారు. అక్టోబర్ 11న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఓ వాహనంలో తరలిస్తుండగా 52 కుట్టుమిషన్లను పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకోవడంతోపాటు కోడ్ ఉల్లంఘనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అంతకుముందే 48 కుట్టుమిషన్లను బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని వెంకటేశ్వరకాలనీ డివిజన్ దేవరకొండ బస్తీకి చెందిన మైనార్టీ నేతల వద్దకు చేరాయి. వాటిని ఎన్నికలు ముగిసిన తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో..
కొందరు కాంగ్రెస్ నాయకులు ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో పేదలకు పంపిణీ చేసిన కుట్టుమిషన్లను వెనక్కి తీసుకోవాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. దీంతో దేవరకొండ బస్తీలో పంజాగుట్ట పోలీసులు సుమారు 30 మంది లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి సాయంత్రంలోగా కుట్టుమిషన్లను అప్పగించాలని ఆదేశించారు. కుట్టుమిషన్లను వెనక్కి ఇవ్వాలనడమేమిటని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ నమోదైన కేసు విచారణలో భాగంగా వాటిని రికవరీ చేస్తున్నామని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బండారి శోభన్ తెలిపారు.