మరోసారి ఇలాంటి పరిస్థితి రావొద్దు
‘బయోఏషియా’ ప్యానల్ చర్చలో వక్తలు
ఒకే వేదికపైకి పరిశోధకులు, ఆవిషర్తలు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : కొవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక పీడకల అని గురువారం ప్రారంభమైన బయోఏషియా సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. బయోఏషియా సదస్సులో ‘కరోనా విపత్తుకు రెండేండ్లు – సవాళ్లు, విజయాలు.. భవిష్యత్తు పరిణామాలు?’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ జరిగింది. దీనికి మోడరేటర్గా సీఎంసీ వెల్లూరుకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ గగన్దీప్ వ్యవహరించారు. ఈ చర్చను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డ్రూ వైస్మన్ ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తల అభిప్రాయాలు..
కొవిడ్ కట్టడికి శతవిధాలా ప్రయత్నం: అమితాబ్ కాంత్, సీఈవో, నీతి ఆయోగ్
కరోనా విపత్తు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు వైద్యరంగంపై పెను భారాన్ని మోపింది. ప్రజలకు ఊరట కల్పించేందుకు కేంద్రం పలురూపాల్లో ప్రయత్నించింది. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేశాం. వ్యాపారవర్గాలను ఆదుకొనేందుకు నేరుగా నగదు బదిలీచేశాం. ఆక్సిజన్ ఉత్పత్తికి 1563 ప్లాంట్లు మంజూరుచేశాం. మొబైల్ ఐసీయూలను ఏర్పాటుచేశాం.
డబ్ల్యూహెచ్వో కీలక పాత్ర పోషించింది: సౌమ్య స్వామినాథన్, చీఫ్ సైంటిస్ట్, డబ్ల్యూహెచ్వో
కొవిడ్-19 వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలస్యంగా స్పందించలేదు. చైనాలోని వూహాన్లో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నదని తెలియగానే జనవరి 4న (2020) నోటీసు ఇచ్చాం. వారంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పూర్తిచేశాం. డబ్ల్యూహెచ్వో కొన్ని దశాబ్దాలుగా ఇన్ఫ్లూయెంజా వైరస్పై అనేక దేశాల్లో పరిశోధనలు చేస్తున్నది. ఈ నెట్వర్క్ను కొవిడ్-19పై పరిశోధనలకు వినియోగించాం.ప్రపంచవ్యాప్తంగా 400 మంది శాస్త్రవేత్తలను జెనీవాకు రప్పించి, బృందాలుగా విడగొట్టి పరిశోధనలు ప్రారంభించాం. ఈ మహాక్రతువులో భారత్ సహా 50 దేశాలు పాలు పంచుకున్నాయి.
60 శాతం మందికి టీకాలు వేస్తేనే..: మహిమ దాట్ల, ఎండీ, బయోలాజికల్ ఈ
మేము వ్యాక్సిన్ పరిశోధన ప్రారంభించే ముందు మాలో మూడు అంశాలు మెదిలాయి. 1) ఇది ప్రభావవంతంగా పనిచేస్తుం దా? 2) రక్షణకు ప్రాధాన్యం 3) అందుబాటు ధర. 4) అవసరా లకు సరిపడా ఉత్పత్తి సామర్థ్యం. ఈ నాలుగు అం శాల ఆధారంగా మేము ఇతరుల కన్నా భిన్నంగా రీకాంబినెంట్ సబ్యూనిట్లపై పరిశోధనలు జరుపాలని నిర్ణయించాం. ఈ క్రమంలో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ తయా రీ, ఉత్పత్తిలో మాకు ఉన్న అనుభవం కలిసి వచ్చింది.
టీబీపై మరో వారం రోజుల్లో కీలక ప్రకటన: కృష్ణ ఎల్లా, ఎండీ, భారత్ బయోటెక్
మేము వ్యాక్సిన్ అభివృద్ధి చేసే సమయంలో రక్షణను అత్యంత ప్రాధాన్య అంశంగా ఎంచుకొన్నాం. ఇనాక్టివేటెడ్ వైరస్లతో టీకాలు అభివృద్ధి చేయడంలో మాకు ఎంతో అనుభవమున్నది. ఇలా ఇప్పటివరకు ఏడు టీకాలు తయారుచేశాం. మనదేశంలో బీఎస్ఎల్-4 స్థాయి ల్యాబ్లు 4 మాత్రమే ఉన్నాయి. ఇందులో మూడు హైదరాబాద్లోనే ఉండటం విశేషం. టీబీకి సంబంధించి మరో వారం రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నాం.
ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెరిగింది: రాజేశ్ ఎస్ గోఖలే, సెక్రటరీ, బయో టెక్నాలజీ
కరోనా విపత్తుతో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెరిగింది. ప్రజలు శాస్త్రవేత్తలపై, వైద్యరంగంపై పూర్తి నమ్మకం ఉంచారు. ఇప్పుడు పోస్ట్ కొవిడ్ సమస్యలపైనా ప్రధానంగా దృష్టి సారించాలి. బయోటెక్నాలజీ విభాగం పరంగా కొవిడ్ పరిశోధనలకు అనువైన వాతావరణం ఏర్పాటు చేశాం. టీకాలు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. కాబట్టి పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయనో, ఒకరి లాభం కోసమో మేము వేగంగా నిర్ణయాలు తీసుకోలేము. అసంబద్ధంగా, అసంపూర్తిగా ఉన్న పరిశోధనలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించలేము. ఐటీ పరిశ్రమ మాదిరిగానే లైఫ్ సైనెస్స్ పరిశ్రమకు కూడా ఒక ప్రత్యేక సహకార వ్యవస్థ ఉండాలని ప్రభుత్వానికి తెలిసివచ్చింది. మరోవైపు మా బయోటెక్నాలజీ శాఖ టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి పెంచడం, జీనోమ్ సీక్వెన్సింగ్, వేరియంట్లను గుర్తించడంలో స్టార్టప్లను ప్రోత్సహించింది.
రికార్డు సమయంలో టీకాలు: పీటర్ పియోట్, ఈయూ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ (ఎపిడమిక్స్)
కరోనా విపత్తు ఫలితంగా రికార్డు సమయంలోనే టీకాలు అభివృద్ధి చేయగలిగాం. ఇప్పటికీ కొవిడ్ చికిత్స ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఒక యాంటీవైరల్ ఇస్తే సరిపోయేది కాదు. దీనిని అధిగమించాలంటే సమాచార మార్పిడి ఒక్కటే శరణ్యం. భవిష్యత్తులోనూ ఇదే సూత్రాన్ని పాటించాలి.
అన్ని వేరియెంట్లకు ఒకటే వ్యాక్సిన్: డ్రూ వైస్మాన్
అన్ని కరోనా వేరియెంట్లను ఎదుర్కొనేందుకు ఒకటే వ్యాక్సిన్ను అభివృద్ధిచేస్తున్నట్టు ప్రముఖ వైద్య పరిశోధకుడు డ్రూ వైస్మాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి ‘పాన్ కరోనా వైరస్ వ్యాక్సిన్’పై పరిశోధనలు జరుగుతున్నాయని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. బయోఏషియా సదస్సులో భాగంగా గురువారం అపోలో హాస్సిటల్స్ ఎండీ సంగీతారెడ్డితో కలిసి చర్చలో పాల్గొన్నారు. ఇన్ఫెక్షన్ ఉన్నంతవరకు కరోనా వైరస్ వివిధ రూపాల్లో విజృంభిస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రపంచం మొత్తం పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ పూర్తయినప్పుడే ఈ వైరస్ వ్యాప్తిని, కొత్త వేరియంట్లను నిలువరించగలమని స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఆఫ్రికాలో కేవలం 15 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకొన్నారని తెలిపారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో పోల్చితే ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఎంతో ప్రభావవంతంగా పనిచేశాయని తెలిపారు.