హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఏ మొక్క నుంచి, ఏ పంట నుంచి ఎంత నీరు ఆవిరి అవుతున్నదో లెక్కగట్టే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే..? అది సాగునీటి రంగంలోనే మరో విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుంది. గేమ్చేంజర్ లాంటి సరికొత్త్త ప్రయోగానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం శ్రీకారం చుడుతున్నది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రయోగాన్ని భుజానికి ఎత్తుకుంటున్న వ్యవసాయవర్సిటీ శనివారం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్నారెస్సీ)తో ఒప్పందం చేసుకున్నది. ఇందులో భాగంగా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎన్నారెస్సీ ఈటీ ఫ్లక్స్ టవర్ను ఏర్పాటుచేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం పది కేంద్రాలలో ఈ టవర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించగా, తెలంగాణకే తొలి ఘనత దక్కుతున్నది. ఇది శాటిలైట్ సహకారంతో పనిచేస్తుంది. ఏ మొక్క (ఏ పం ట) ఎంత నీటిని ఆవిరి రూపంలో పైకి పం పిస్తుందో లెక్కిస్తుంది. దీని ఆధారంగా ఆ పంటకు ఎంత నీరు ఇవ్వాలనేది తెలుస్తుం ది. దీంతో ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలు ఎంత నీటిని ఆవిరి రూపంలో పంపిస్తున్నాయో తెలిసిపోతుంది. తద్వారా ఆ పంటలకు ఎప్పుడు, ఎంత నీరు ఇవ్వాలో లెక్కించి, ఆ మేరకు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదలచేయొచ్చు. ఈ విధానం వల్ల కనీసం 20 నుంచి 30 శాతం సాగునీరు ఆదా అవుతుందని అధికారుల అంచనా. ఈ ప్రయోగం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో జరగడం సంతోషంగా ఉన్నదని వ్యవసాయవర్సిటీ వీసీ ప్రవీణ్రావు పేర్కొన్నారు. ఈ విధానంతో రాష్ట్రంలో సాగునీటిరంగం మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రయోగం ద్వారా భూమిలో తేమ శాతం ఎంత ఉన్నదో తెలుసుకోనున్నారు. ప్రతి 15, 30 సెంటీమీటర్లకు తేమ శాతాన్ని లెక్కించనున్నారు.