TS RERA | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సొంత ఇంటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసుకునేందుకు సగటు భారతీయులు తమ ఆదాయంలో దాదాపు 77 శాతం మేరకు వెచ్చిస్తున్నట్టు ఓ సర్వేలో తెలింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఏజెంట్లకు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరమున్నదని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గుర్తించారు. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో మోసాలకు చెక్ పెట్టేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటు బ్యాంకర్లు, అస్కి లాంటి సంస్థల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇండ్లు, ప్లాట్ల కొనుగోళ్లలో మోసపోయి రెరాను ఆశ్రయిస్తున్నవారిలో విద్యావంతులు, ఉద్యోగులు, అధికారులే ఎక్కువగా ఉండటంతో రెరా చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. స్థిరాస్తి కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒప్పందాల గురించి వివరిస్తున్నారు. రెరా చట్టంలోని పలు సెక్షన్లు, వాటి అమలు తీరుపై ఇటీవల రెరా సిబ్బందికి శిక్షణ ఇప్పించడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఎజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని రియల్ ఏస్టేట్ సంస్థలు, క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ, నరెడ్కో, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) తదితర సంస్థల భాగస్వామ్యంతోనూ మరికొన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.