హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో రిజిస్టర్ చేసుకోకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ప్రీ-లాంచ్ పేరుతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పత్రికా ప్రకటనలు ఇస్తున్న సంస్థలతోపాటు ప్రకటనల్లో రెరా రిజిస్ట్రేషన్ నంబర్ పొందుపర్చని సంస్థలకు నోటీసులిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో రిజిస్టర్డ్ ఏజెంట్ల సంఖ్యను పెంచేందుకు రెరా ప్రయత్నిస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెరాలో 6,705 ప్రాజెక్టులు రిజిస్టరయ్యాయి. ఏజెంట్లు మాత్రం 2,911 మందే నమోదు చేసుకున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో అనధికారికంగా ఎక్కువ మంది విక్రయాలు చేస్తున్నట్టు రెరా గుర్తించింది. ఈ నేపథ్యంలో మిగిలినవారిని కూడా రెరాలో నమోదు చేయించి శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ఏజెంట్లుగా నమోదు చేసుకోవడానికి రూ.10 వేలు, ఇప్పటికే నమోదు చేసుకున్న ఏజెంట్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్కు రూ.5 వేలు ఫీజుగా నిర్ణయించారు.