హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ నిబంధనలను ఉల్లంఘించిన పలువురు డెవలపర్లకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) వెల్లడించింది. వాటిలో ప్రజ్ఞ ఎకోస్పెన్ (మియాపూర్), శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ (చింతల్కుంట), నార్త్ఈస్ట్ హ్యాబిటేషన్స్ (కొండాపూర్), వీఆర్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ (సంగారెడ్డి జిల్లా), ఇన్వెస్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ (కేపీహెచ్బీ కాలనీ), భారతి లేక్ వ్యూ టవర్ బిల్డర్స్ (కొంపల్లి) తదితర ప్రాజెక్టులు ఉన్నట్టు వివరించింది.
రియల్ ఎస్టేట్ కంపెనీలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ తదితర సంస్థల అనుమతులతోపాటు రెరా రిజిస్ట్రేషన్ కూడా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఇండ్లు, ఫ్లాట్లను కొనుగోలు చేయాలనుకునేవారు రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టుల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, ప్రీలాంచ్ ఆఫర్లను నమ్మి మోసపోరాదని సూచించారు. రెరా నిబంధనలను ఉల్లంఘించిన రియల్టర్లపై వాట్సాప్ నంబర్ 9000006301, ఫోన్ నంబర్ 040-29394972తోపాటు rera-maud@ telangana.gov.in, secy-rera-maud@telangana.gov.in ఈ-మెయిల్ ఐడీలకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. రెరా నిబంధనలను అతిక్రమించినట్టు గుర్తించిన 918 ప్రాజెక్టుల నిర్వాహకులకు దాదాపు రూ.31 కోట్ల జరిమానా విధించామని, అందులో ఇప్పటివరకు రూ.13.70 కోట్లు రికవర్ చేశామని వివరించారు.