హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ రూ. 1348 కోట్ల అంచనాతో 8 చోట్ల చేపడుతున్న రెండోదశ 232 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం ప్రీబిడ్ సమావేశానికి 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారం సింగరేణి భవన్లో నిర్వహించిన సమావేశానికి టాటా సోలార్ పవర్తోపాటు ఎన్రిచ్ ఎనర్జీ, నోవాస్ గ్రీన్ ఇంజినీరింగ్, ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంట్ల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.
మొత్తం మూడు టెండర్లుగా నిర్మాణ ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ ప్రదేశాలు, రవాణా సౌకర్యాలను స్వయంగా పరిశీలించుకోవచ్చని సూచించారు. సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ విధివిధానాలను తెలుసుకుని ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ నెల 25లోగా టెండర్లు దాఖలు చేయాలని, టెండర్లు ఖరారైన తర్వాత ఏడాదిలోపు కచ్చితంగా నిర్మాణాలు పూర్తి చేయాలని, నిర్మాణ దశలనుబట్టి బిల్లులను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా సంస్థ చెల్లిస్తుందని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్ జీఎంలు జానకీరామ్, మల్లెల సుబ్బారావు, సుబ్బారావు, ప్రిజరాల్డ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ రాజు తదితరులు పాల్గొన్నారు.