ప్రభుత్వ పాఠశాలల్లో : 27.45%
ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో : 18.35%
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 16%
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ మహేశ్వరం: చానాళ్ల తర్వాత బడి గంట మోగింది. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో సందడి మొదలైంది. కరోనా కారణంగా 16 నెలలపాటు మూతపడిన విద్యాసంస్థలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉత్సాహంగా బడిబాటపట్టిన విద్యార్థులకు పలుచోట్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పూలు, పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 27.77 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 21 శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34. 93 శాతం, సిద్దిపేటలో 34.4 శాతం, రాజన్న సిరిసిల్లలో 33. 84 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 13. 82, సంగారెడ్డిలో 14.49 శాతం విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 16 శాతం విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరైనట్టు ఇంటర్బోర్డు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో జూనియర్ కాలేజీల్లో 45 శాతం వరకు హాజరు నమోదుకాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సున్నా శాతం హాజరు నమోదైంది.
వనపర్తి, నాగర్కర్నూలు జిల్లాల్లో 3 నుంచి 4 శాతం విద్యార్థులే హాజరయ్యారు. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ కాలేజీల్లో 1,81,558 మంది విద్యార్థులకుగాను 29,594 విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్, ఫార్మసీ ల్యాబ్ తరగతులకు 90 శాతం విద్యార్థులు హాజరైనట్టు సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లల్లో 50 శాతం విద్యార్థులు చేరినట్టు తెలుస్తున్నది. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజభవన్ స్కూల్ను సందర్శించి విద్యార్థులను ఉత్సాహపరచగా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జ్లి మహేశ్వరంలోని బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ధైర్యాన్ని నింపారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వడ్డించారు. మంత్రి సబిత తొలుత హైదరాబాద్లోని విజయనగర్కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, అక్కడి వసతులను పరిశీలించారు. తర్వాత మహేశ్వరం బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా జాగ్రత్తలపై సూచనలిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఇన్నాళ్లు ఇండ్లలో జాగ్రత్తలు తీసుకున్నవిధంగానే పాఠశాలల్లోనూ వాటిని పాటించాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను గమనించాలని, భౌతికదూరం పాటిస్తూ విద్యాబోధన కొనసాగించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. రెడ్క్రాస్ సొసైటీ ద్వారా హైదరాబాద్లో విద్యార్థులకు 50 వేల మాస్క్లు, శానిటైజర్లు పంపిణీచేశారు.