Hanumantha Rao | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్థిక విధానాలు దేశానికే ఆదర్శమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రశంసించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ సమస్యలకు పుట్టినిల్లుగా ఉండేదని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే తెలంగాణ రూపురేఖలను మార్చేశారని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి నివేదికను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో హనుమంతరావు కీలకోపన్యాసం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను తెలంగాణ సాధించుకుంటున్నదని తెలిపారు. తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం తగ్గినట్టు ఎన్సీఆర్బీ, ఎస్సీఆర్బీ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో మావోయిజం, తీవ్రవాదం పెరిగిపోతుందని భయపెట్టిన శ్రీకృష్ణ కమిటీతోపాటు అనేకమంది ఆరోపణలన్నీ అబద్ధమని అనతికాలంలోనే తేలిపోయాయని పేర్కొన్నారు.
ఆర్థిక రంగంలో తెలంగాణ అనతికాలంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగిందని హనుమంతరావు కొనియాడారు. రూ.3.17 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ.. జీఎస్డీపీ వృద్ధిలోనూ రూ.12.93 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రజల నెలవారీ సగటు సంపాదన జాతీయ సగటు కంటే 25 శాతం ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ఇదంతా రాత్రికి రాత్రే సాధించిన అద్భుతం కాదని, దీని వెనక సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా చేసిన కృషి కనిపిస్తున్నదని పేర్కొన్నారు. 2015లో తెలంగాణలో 1,358గా ఉన్న రైతు ఆత్మహత్యల సంఖ్య 2021 నాటికి 352కి తగ్గిపోయాయని.. కాళేశ్వరం, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులతో తెలంగాణ ముఖచిత్రమే మారిపోయిందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా లాంటి అనేక పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో కరెంట్ కోతలతో మూతబడిన పరిశ్రమలు ఇప్పుడు నిత్యం కార్మికులతో కళకళలాడుతున్నాయని.. రాష్ర్టానికి వచ్చిన భారీ పెట్టుబడులతో 73 వేలమందికి ఉపాధి లభించిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా మారారని వివరించారు. విద్య, వైద్య రంగాల్లోనూ తెలంగాణ ఎంతో పురోగమించిందని, రాష్ట్రంలో రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఖ్య 293 నుంచి 1,002కి పెరిగిందని గుర్తుచేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశమంతా అనుసరించాల్సిన గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసానిచ్చాయని హనుంతరావు చెప్పారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయ సంఘాలకు చేయూతనివ్వడంతో పల్లెల్లో ఆర్థిక వికాసం కనిపిస్తున్నదని, పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజలకు పాలన చేరువైందని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలోని అనేక పల్లెలు, పంచాయతీలు అత్యుత్తమ స్థాయికి ఎదిగి పలు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయని తెలిపారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒకవైపు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తూనే, మరోవైపు భవిష్యత్తు తరాలపై శ్రద్ధ వహించారని హనుమంతరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసిన తెలంగాణ సర్కారు.. హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం గత తొమ్మిదేండ్లలో 6.85 శాతం పెరిగిందని, దేశంలోని 7 మెగాసిటీల్లో హైదరాబాద్ 146.8% వృద్ధిరేటుతో అగ్రస్థానంలో నిలవడంతోపాటు ‘గ్రీన్ సిటీ అవార్డు-2022’, ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్’ అవార్డును సాధించిందని గుర్తుచేశారు. కాలుష్య నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, సౌర విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నదని తెలిపారు. ‘రూఫ్టాప్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్’ విషయంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగిత రేటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.2 శాతంగా ఉన్నదని, ఇది జాతీయ సగటు కంటే ఎంతో తక్కువని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాధారణ కార్మికుల శాతం 38 నుంచి 17కు తగ్గిందని, గత తొమ్మిదేండ్లలో స్వయం ఉపాధి 53 శాతం నుంచి 74 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ దేశ ఆర్థిక రంగానికి దిక్సూచిగా ఎదిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. ఒకవైపు కేంద్రం ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ మార్గదర్శనంతో తెలంగాణ తన సొంతకాళ్లపై నిలబడుతూ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని, ఎన్నో పెద్ద రాష్ర్టాలను సైతం వెనక్కి నెట్టి పరుగులు తీస్తున్నదని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే అతికొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం రాష్ట్ర ఆర్థిక వికాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో వైద్యవిద్య సంపన్నులకే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నామని గుర్తుచేశారు.
సమైక్య పాలనలో తెలంగాణలో ఎకరం రూ.50 వేలకే దొరికేదని, ఇప్పుడు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ ప్రజల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని చెప్పినోళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారని, గత తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని యావత్ దేశమంతా కొనియాడుతన్నదని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ రేవతి, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ జీ దయానంద్, స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అడిషనల్ డీజీ శ్రీనివాస్ రెడ్డి, టీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.