హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): గురుకులాలకు సంబంధించి కిరాణా సామగ్రి సరఫరాను పుణె ఏజెన్సీలకు అప్పగించేందుకు సర్కార్ సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే అందుకు సంబంధించి అగ్రిమెంట్లను పూర్తిచేసుకునేందుకు తుది కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా సంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉన్నది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా, పాలు విజయడెయిరీ ద్వారా సరఫరా అవుతున్నాయి.
వంట తయారీకి సంబంధించిన కిరాణా సామగ్రిని ఇప్పటివరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ(డీపీసీ)లే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎక్కడికక్కడ టెండర్లను నిర్వహించి, సప్లయ్ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానానికి చరమగీతం పాడింది. డీపీసీల స్థానంలో సోషల్వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్(పీఎంయూ)ను నిరుడు ఏర్పాటు చేసింది.
గురుకులాలకు సంబంధించి అన్ని వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరల ఖరారు, సేకరణ, సరఫరా, టెండర్ ప్రక్రియను కేంద్రీకృత విధానంలో ఇక్కడే నిర్వహించి ఏజెన్సీలను ఎంపిక చేస్తున్నది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కిరాణా సామగ్రి సప్లయ్ కోసం కేంద్రీకృత విధానంలో గుత్తేదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఫుడ్ప్రొవిజన్కు సంబంధించి టెండర్ నోటిఫికేషన్ను మేలో జారీ చేసి జూన్ 1వ తేదీ వరకు బిడ్లను స్వీకరించింది. మూడు నెలలు కావస్తున్నా ఫుడ్ ప్రొవిజన్ టెండర్ ఫైనల్ కాలేదు. గత గుత్తేదారులకే కొత్త రేట్లను అమలు చేస్తూ తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు.
సీఎం కనుసన్నల్లోనే.. పుణె ఏజెన్సీ
గురుకుల టెండర్లు మొత్తం పీఎంయూ పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని, ఇది కూడా పూర్తిగా సీఎంవో కనుసన్నల్లో కొనసాగుతున్నదని గురుకులవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎంవోలోనే ధరల నిర్ణయం, మానిటరింగ్, ఏజెన్సీల ఖరారు జరిగిపోతున్నది. విద్యార్థులకు సంబంధించి గతంలో టెండర్లను అదే విధానంలో అప్పగించారు. యూనిఫామ్స్ క్లాత్ టెండర్ను రూ. 300 కోట్లకు, పీటీ, నైట్ డ్రెస్, ట్రాక్సూట్ టెండర్ను 200 కోట్లకు, బెడ్షీట్, బ్లాంకెట్ టెండర్ను రూ.150 కోట్లకు, ఐడీకార్డు, స్టేషనరీ కిట్వర్క్ ఆర్డర్ను రూ. 50 కోట్లకు, బ్యాగులు, షూ, సాక్స్కు సంబంధించి వర్క్ ఆర్డర్ను రూ. 380 కోట్లకు గుజరాత్ ఏజెన్సీలకే ప్రభుత్వం కట్టబెట్టింది.
ఇక నోట్బుక్స్, ప్లేట్స్, గ్లాస్, స్పూన్, కప్స్ వర్క్ ఆర్డర్లను ఉత్తర భారతానికి చెందిన ఏజెన్సీలకు అప్పగించింది. తాజాగా ఫుడ్ ప్రొవిజన్ (కిరాణా సామగ్రి) టెండర్ను సైతం పుణెకు చెందిన ఓ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫుడ్ప్రొవిజన్కు సంబంధించి 93 వస్తువులు ఉండగా, 27 బ్రాండెడ్ ఐటమ్స్ (ఆశీర్వాద్, ఎండీహెచ్, స్వస్తిక్, ఎవరెస్ట్, జెమినీ), 28 వస్తువులు (పప్పులు, ఉప్పులు), మరో 38 వస్తువులను వార్షిక రేట్ల ప్రకారం గుత్తేదారులకు అప్పగించాలని నిర్ణయించారు. వాస్తవంగా గత నెలలోనే టెండర్ ఖరారు కావాల్సి ఉన్నది. అయితే మార్కెట్ ధరలకంటే ఎక్కువకు గుత్తేదారు కోట్ చేయడంతో దాదాపు రూ. 200 కోట్లకుపైగా సర్కార్ దోచిపెడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో చివరి నిమిషంలో ఆ టెండర్ ప్రక్రియ వాయిదా పడినట్టు తెలుస్తున్నది. తాజాగా ఫుడ్ ప్రొవిజన్ టెండర్ను పుణె కంపెనీకి అప్పగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.