హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/భీమారం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ పరీక్షలను ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్టు టీఎస్ ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే రాజిరెడ్డి తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షను మూడు సెషన్లల్లో చేపట్టనున్నారు. శనివారం కాకతీయ వర్సిటీ పరీక్షల నియత్రణాధికారి ప్రొఫెసర్ మహేందర్రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ కే రాజిరెడ్డి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ను విడుదలచేశారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు చెప్పారు. జనరల్, బీసీ క్యాటగిరీ అభ్యర్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.450 ఫీజు చెల్లించాలని అన్నారు. రూ.250 అపరాధ రుసుముతో జూన్ 30, రూ.500 అపరాధ రుసుముతో జూలై 15, రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఆగస్టు 13 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇందుకు 60 పరీక్షా కేంద్రాలు, మరో 14 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నామని అన్నారు. 25 శాతం మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టేనని, ఎస్సీ, ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్కుల్లేవని తెలిపారు. మరింత సమాచారం కోసం https://icet.tsche.ac.in లో చూడవచ్చన్నారు.