హైదరాబాద్: వసతులు లేని కారణంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు రద్దయిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్ధుబాటు చేయాలన్న గత ఉత్తర్వుల అమలును నిలివేయాలనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. రద్దయిన కాలేజీల విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి సర్ధుబాటు చేసేందుకు అనుమతిస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తగిన వసతులు లేని కారణంగా కాలేజీల అనుమతులను రద్దు చేసిన తరుణంలో ఆ కాలేజీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి సర్ధుబాటు చేయాలన్న గత హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ టీఆర్ఆర్, మహవీర్ మెడికల్ కాలేజీలు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వీటిని న్యాయమూర్తులు అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ కే శరత్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
కాలేజీల్లో వసతులను తనిఖీ చేసిన ఎంఏఆర్బీకి కాలేజీలను రద్దు చేసే అధికారం లేదని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. కాలేజీల వాదనలను పట్టించుకోకుండా రద్దు చేసిందన్నారు. ఎంఏఎంబీ ఉత్తర్వులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కమిటీ వద్ద అప్పీల్ చేసే ముందు కాలేజీల వాదనను వినలేదన్నారు. పిటిషనర్ల కాలేజీల్లో వసతులు ల్లేవని ఎన్ఎంసీ తరఫు న్యాయవాది జీ పూజిత చెప్పారు. మహవీర్లో 50 శాతం, టీఆర్ఆర్లో 70 శాతం అధ్యాపకుల కొరత ఉందన్నారు. పడకలు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు కూడా చట్ట నిబంధనలకు అనుగుణంగా లేవన్నారు. రద్దయిన కాలేజీల విద్యార్థులను వేరే కాలేజీల్లో సర్ధుబాటు చేయాలన్న ఉత్తర్వులను సవరించక్కర్లేదని తెలిపారు. వాదనల తర్వాత ఎన్ఎంసీ తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.