Rupai Foundation | సైదాబాద్, మార్చి 2: ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తామంటున్నది ‘రూపాయి ఫౌండేషన్’. ఆదివారం ఓ జంటను ఒక్కటి చేయనున్నది కూడా! సామాజిక సేవలో భాగంగా 15 ఏండ్లుగా దాదాపు వందకుపైగా అనాథలు, దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు నాగమల్ల అనిల్కుమార్, అరుణ ఇటీవల ‘రూపాయి ఫౌండేషన్’ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు. రూపాయితో తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటే దివ్యాంగ జంటకు ఉచితంగా పెండ్లి చేస్తామని చెప్తున్నారు.
సంగారెడ్డికి చెందిన ప్రవళికకు మేడ్చల్కు చెందిన మట్టా రమేశ్తో సైదాబాద్ మొయిన్ రోడ్డుపై ఉన్న ఎస్బీఐ బిల్డింగ్ ఆర్యా ఈవెంట్స్లో ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ‘దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేస్తే అదే రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది’ అన్న నినాదంతో వివాహాలకు అవసరమైన విరాళాలను సేకరిస్తున్నది రూపాయి ఫౌండేషన్. ఇలాంటి వివాహాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తమవంతుగా ఒక్క రూపాయి (9246576070 గూగుల్ పే) విరాళంగా ఇవ్వాలని నాగమల్ల అనిల్, అరుణ విజ్ఞప్తి చేశారు.