హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన కృషితోపాటు ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజ్ఞప్తులతో కేంద్ర ఉపరితల రవాణశాఖ ఒక అడుగు ముందుకేసింది. గతంలో ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం.. ఎట్టకేలకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీకి కాంట్రాక్ట్ సంస్థను ఎంపికచేసింది. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి డీపీఆర్ తయారు చేసే బాధ్యతలను ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఇంటర్ కాంటినెంటల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు జాతీయ రహదారుల సంస్థ అప్పగించింది. ఈ సంస్థ జనవరిలోగానే డీపీఆర్ రూపొందించి జాతీయ రహదారుల సంస్థకు అప్పగించనున్నది. డీపీఆర్ పూర్తయిన తర్వాత భూసేకరణ కోసం ప్రత్యేక యూనిట్లు (కాలాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతారు. రాష్ట్ర ప్రభుత్వం కాలాలు ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తుంది.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగానికి డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసిన జాతీయ రహదారుల సంస్థ, ఈ రహదారికి ఇంకా నంబర్ కేటాయించలేదు. ఈ రహదారికి నంబర్ కేటాయించడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్తున్నారు.