హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్తో హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్రోడ్డు (త్రిపుల్ఆర్)కు వివిధ జలవనరుల కారణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఉన్న ఔటర్ రింగ్రోడ్డు, కొత్తగా నిర్మించనున్న రీజినల్ రింగ్రోడ్డుకు మధ్యలో దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో అనేక వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఆయా జల వనరుల నుంచి వచ్చే నీటి ప్రవాహం ఏయే దారుల్లో ఎంత వేగంతో, ఎంత ఎత్తున వెళ్తుందనే అంశంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. నీటి ప్రవాహం కొన్నిచోట్ల నిదానంగా, మరికొన్ని చోట్ల చాలా వేగంగా ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. రీజినల్ రింగ్ రోడ్డును 3.5 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తుతో నిర్మించడం వల్ల ఆయా జల వనరుల నుంచి ఎంత వరద వచ్చినా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు అవసరమైనచోట వంతెనలు నిర్మించనున్నట్టు ఇంజినీర్లు చెపుతున్నారు. దీంతోపాటు గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్లో ఎక్కడా గ్రామాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల వద్ద త్రిపుల్ఆర్ను దాటి రాకపోకలు సాగించేందుకు వీలుగా అండర్పాస్లు నిర్మంచనున్నారు. రాష్ట్ర, జాతీయ రహదారులకు సంబంధించిన ఇంటర్చేంజ్ల వద్ద కూడా అండర్పాస్లు నిర్మించనున్నారు. అటవీ ప్రాంతాల్లో జంతువులు రోడ్డుపైకి రాకుండా, అవి అటు, ఇటు వెళ్లడానికి వీలుగా అండర్పాస్లు ఏర్పాటుచేయనున్నారు. వీటన్నింటిపై అలైన్మెంట్ దశలోనే అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
340 కిలోమీటర్లు పరిధిలో నాలుగు లేన్ల రహదారితో నిర్మించనున్న రీజినల్ రింగ్రోడ్డు దేశంలోనే అతి పెద్ద రింగ్రోడ్డుగా ఖ్యాతి పొందనున్నది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్లు మేర 8 లేన్లతో నిర్మించిన ఔటర్ రింగ్రోడ్డు దేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్డుగా గుర్తింపు పొందింది. ఈ రికార్డును ట్రిపుల్ ఆర్ అధిగమించనున్నది. మొదటి దశలో ఉత్తరభాగం 158 కిలోమీటర్లు సంగారెడ్డి- నర్సాపూర్-తూప్రాన్- గజ్వేల్-యాదాద్రి-భువనగిరి- చౌటుప్పల్ వరకు నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.