న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ అదే గందరగోళం నెలకొన్నది. సభ రెండుసార్లు వాయిదాపడినా.. విపక్షాలు మాత్రం నినాదాలతో హోరెత్తించారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు లోక్సభ సమావేశం అయిన తర్వాత రైల్వే గ్రాంట్స్పై చర్చ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల అంశంపై చర్చ చేపట్టాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అధిర్ అన్నారు. బీజేపీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్.. రైల్వే గ్రాంట్స్ అంశంపై మాట్లాడారు. కీలక సమస్యలపై చర్చలు చేపట్టకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీపై ఆయన టార్గెట్ చేశారు. రైల్వే ద్వారా సాంస్కృతిక జాతీయవాదం వృద్ధి చెందుతుందన్నారు. రైల్వేలు దేశానికి లైఫ్లైన్ వంటిదని ఎంపీ కృపాల్ యాదవ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వేళ రైల్వే వ్యవస్థ ఎంతో సహకరించిందన్నారు. పీపీఈ కిట్ల ట్రాన్స్ఫర్, శానిటైజర్లు, నిత్యావసర వస్తువుల పంపిణీలో కీలకపాత్ర పోషించిందన్నారు. రైల్వేలు అందించిన వైద్య సదుపాయాల గురించి కూడా ఆయన వెల్లడించారు. అయితే విపక్ష సభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో.. చైర్లో ఉన్న మీనాక్షీ లేఖి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు రాజ్యసభలో ఇవాళ ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పటికే ఆ బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కింది. ఆ తర్వాత రాజ్యసభను కూడా సోమవారానికి వాయిదా వేశారు.