భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. అధిష్ఠానాన్ని ధిక్కరించి ఎవరు ఎలా వ్యవహరించినా పార్టీ చూసుకుంటుందని అన్నారు.
అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం కృషిచేస్తానని తెలిపారు. గతం లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ప్రా తినిధ్యం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి నాయకుడికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు. అదే స్థాయిలో జిల్లాను కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టించారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తమ పార్టీ ముందుకెళ్తున్నదని చెప్పారు. ప్రభుత్వ సంస్థలను విక్రయించడం తప్ప.. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎవరికైనా ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు.