సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుకు గత పదిహేను రోజులుగా కొనసాగిన నీటి వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల నీరు నిలువ ఉంది.
గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 4045 క్యూసెక్కుల నీరు వచ్చినట్లు నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు వెల్లడించారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు తగ్గడంతోనే ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గిందని ఆయన తెలిపారు.
జులై నెలలోనే ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో 8.733 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. ఈ సారి పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని డిప్యూటీ ఈఈ తెలిపారు. కాగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉందని ఈఈ తెలిపారు.