కామారెడ్డి : రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన రాజు మంగళవారం సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య చిక్కుకున్న సంగతి తెలిసిందే. 43 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రాజు ప్రాణాలు కాపాడారు పోలీసులు, ఫారెస్టు అధికారులు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు మీడియాతో మాట్లాడారు.
మంగళవారం మధ్యాహ్నం వేట కోసం సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లాను. ఈ క్రమంలో పెద్ద బండ రాయి మీదుగా వెళ్తుంటే బండ రాయి మధ్యలో సెల్ఫోన్ పడి పోయింది. దాన్ని తీసే క్రమంలో ఆ బండ రాయి మధ్యలోనే ఇరుక్కుపోయాను. స్నేహితుడు అశోక్ ధైర్యంతో నన్ను తీసే ప్రయత్నం చేశాడని కాని వీలు కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నేను బతుకుతానని అనుకోలేదు. తెలంగాణ పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, వైద్యులు రెండు రోజుల పాటు శ్రమించి నన్ను ప్రాణాలతో బయటకు తీశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా ధైర్యమే నన్ను బతికించింది అని రాజు కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బండ రాళ్ల మధ్య చిక్కుకుని నరకయాతన అనుభవించిన తన భర్త రాజు ప్రాణాలతో బయటపడటం సంతోషంగా ఉందని భార్య లక్ష్మీ పేర్కొంది. 43 గంటల పాటు రాజు నరకయాతన అనుభవించాడు. అధికారులు కంటి మీద కునుకు లేకుండా శ్రమించి నా భర్తను బయటకు తీశారు. నా భర్తను కాపాడిన ప్రతి ఒక్కరికీ తలవంచి నమస్కరిస్తున్నా. నా భర్తకు అందరూ కలిసి పునర్జన్మ ప్రసాదించారని లక్ష్మీ బోరున విలపించారు.