హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవడం ఖాయమని మున్సిపల్ ఛైర్మన్స్ ఛాంబర్ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛైర్మన్స్ ఛాంబర్ ఛైర్మన్ ఎన్ రెడ్డిరాజు అన్నారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ఖరారు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు ఛైర్మన్లందరూ క్రియాశీలక పాత్ర పోషించాలని సమావేశంలో తీర్మానించారు.
మంగళవారం హైదరాబాద్లో మున్సిపల్ ఛైర్మన్స్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఛైర్మన్లకు మధ్య అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొని సమన్వయం చేయాలని సమావేశం తీర్మానించింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పదవికి నేరుగా ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేయాలని, 2019 చట్టాన్ని సవరించి బాధ్యతలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచేలా చూడాలని సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఛైర్మన్లకు, కౌన్సిలర్లకు గౌరవ వేతనాన్ని మరింత పెంచాలని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఛైర్మన్లు, కౌన్సిలర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. భవిష్యత్తులో మున్సిపల్ ఛైర్మన్లకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ స్థానాల్లో తగు ప్రాధాన్యత కల్పించాలని తీర్మానించారు. తమ సమస్యలపై త్వరలో మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు. ఛాంబర్ కార్యదర్శి ఎడమ సత్యం, ఉపాధ్యక్షురాలు మంజుల, మున్సిపల్ ఛైర్మన్లు కేశవ్, రాజమౌళి గుప్తా, జమున, నరేందర్, సుష్మ, స్వప్న, ప్రణీత, కల్పన, కప్పర స్రవంతి, రజని, విజయలక్ష్మి, శంకర్, ఆర్ఎస్ కర్ణ, బసవరాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.