హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కందుల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. రైతులకు ఇబ్బంది లేకుండా, మద్దతు ధరకు కొనేందుకు సిద్ధమైంది. కందులకు ఈ ఏడాది మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. మద్దతు ధర క్వింటాలుకు రూ.6600 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7వేల వరకు పలుకుతున్నది. అయితే, ఈ ధర ఎప్పటి వరకు ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో మార్కెట్లో పోటీ పెరిగి, రైతులకు మరింత ధర వచ్చే అవకాశమూ ఉంది.