హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్ఈ) టీచర్ పోస్టుల భర్తీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ, డీఎడ్ అర్హులైన వారితో ఈ పోస్టులను భర్తీచేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం జీవో 4 జారీ చేశారు. ఈ పోస్టుల నియామక విధానం.. అర్హతలు వంటి వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో 220 స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) , 796 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను భర్తీచేయడానికి డీఎస్సీ -24 నోటిఫకేషన్ను గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను ఎస్ఏ (ఎస్ఈ)గా.. సెకండరీ గ్రేడ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను (ఎస్జీటీ) ఎస్ఈ పోస్టులుగా పరిగణిస్తారు. ఈ పోస్టుల భర్తీకి కూడా సీటెట్ లేదా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎస్ఏ పోస్టులకు టెట్ పేపర్ -2, ఎస్జీటీ పోస్టులకు టెట్ పేపర్ -1లో అర్హత సాధించాలి. మొత్తం 160 ప్రశ్నలకు 80 మార్కులతో పరీక్ష నిర్వహిస్తారు. టెట్కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది.