హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం నిరుడు వెలువరించిన నోటిఫికేషన్లోని నిబంధనలను అమలు చేయకుండా తమను పకన పెట్టారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గంగాప్రసాద్ సహా 10 మంది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పుల్లా కార్తీక్ మంగళవారం విచారణ జరిపారు. జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలని, ఎమ్మెస్సీని ఏ సబ్జెక్టులో పూర్తిచేసినా ఫర్వాలేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ తెలిపారు. దీంతో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివినవారు సైతం జూనియర్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నరని, పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్ట్లోనూ పిటిషనర్ల పేర్లు ఉన్నాయని వివరించారు. కానీ, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని, ఆ కమిటీ నుంచి నివేదిక వచ్చే వరకు ఆగాలని పేర్కొన్న అధికారులు.. ఆ నివేదిక రాకముందే పిటిషనర్లను పకనపెట్టి ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారని రమేశ్ వివరించారు. ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదని ఆయన పేర్కొంటూ.. మెరిట్ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. దీంతో పిటిషనర్ల అభ్యంతరాలపై స్పందించాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు.