హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): హైటెక్ సిటీ, హెచ్ఐసీసీకి అత్యంత సమీపంలోని ఖానామెట్ భూములు రికార్డుస్థాయి ధరలు పలికాయి. అంచనాలకు మించి హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. మొత్తంగా 14.91ఎకరాలకు గాను రూ.729 కోట్లకు పైగా రాబడి సమకూరింది. కోకాపేట స్థలాలను మించి ఎకరాకు సరాసరి ధరలు పలకటం విశేషం. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 41/14లోని మొత్తం 14.91 ఎకరాల్లోని 5 ప్లాట్లకు టీఎస్ఐఐసీ అధికారులు శుక్రవారం ఈ-వేలాన్ని నిర్వహించారు. 46 మంది బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోగా భూములను దక్కించుకొనేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారులు పోటీపడ్డారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 కోట్ల ధరను నిర్ణయించగా, బిడ్డర్లు పోటీపడి అధిక ధరకు ప్లాట్లను దక్కించుకొన్నారు. ఎకరాకు కనిష్ఠంగా రూ.43.60 కోట్లు, గరిష్ఠంగా రూ.48.60 కోట్లు పలికింది. మొత్తంగా వేలం ద్వారా టీఎస్ఐఐసీకి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. ఐదు ప్లాట్లలో 14వ ప్లాట్ విస్తీర్ణం 2.92 ఎకరాలుండగా, ఎకరాకు రూ.55 కోట్ల చొప్పున ఆ ఒక్క ప్లాట్కే రూ.160.60 కోట్ల ధర పలికింది. గురువారం నిర్వహించిన వేలంలో కోకాపేట భూముల్లో ఎకరానికి సగటున రూ.40.5 కోట్లు రాగా, ఖానామెట్ భూముల్లో ఎకరానికి సగటున రూ.48.92 కోట్లు వచ్చాయి. ఐటీకారిడార్ను ఆనుకొని ఉండటం, జాతీయ అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరిగే హైటెక్స్కు అత్యంత సమీపంలో ఉండటంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బిడ్డర్లు పోటీపడ్డారు.